Tuesday, April 16, 2024

సూర్య దేవాలయానికి ప్రొటెక్షన్.. ప్రకటించిన కేంద్రం..

ప్ర‌భ‌న్యూస్: గుప్త నిధుల కోసం కొందరు దుండగులు త్రవ్వకాలలో ధ్వంసమైన సూర్యదేవాలయానికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ రక్షణ దక్కనుంది. ఈ మేరకు ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ).. నల్గొండ జిల్లాలోని శాలి గౌరారం మండలం ఆకారం గ్రామంలో ఉన్న సూర్య దేవాలయం ప్రాంగణంలో చేసిన సర్వే ఆధారంగా ఈ విశయాన్ని ధృవీకరించారు. దాదాపు 800 ఏళ్లనాటి చారిత్రక నేపధ్యం ఉన్న సూర్య దేవాలయాన్ని ఏఎస్‌ఐ బృందం సర్వే చేసి పురావస్తు వారసత్వ కట్టడానికి కావలసిన నిబంధనలు ఉన్నాయని గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉండేందుకు కావలసిన అన్ని అర్హతలను కలిగి ఉందని అధికారులు ధృవీకరించారు.

సూర్యదేవాలయం ఇప్పటికే ఇరువైపులా ధ్వంసం అయి పునరుద్ధరణకు వీలులేని స్థితిలో ఉంది. ఆలయ పరిధిలో ఉన్న 57.4 ఎకరాల భూమి కూడా ఆక్రమణలకు గురైతోంది. దాంతో గ్రామ సర్పంచ్‌, దేవాలయ రక్షణ కమిటీ సభ్యులతో పాటు గ్రామస్థులు ఆలయ పరిరక్షణ కోసం ప్రభుత్వానికి అనేక విన్నపాలు చేశారు. కాగా.. గవర్నర్‌ తమిళసై సౌందర్య రాజన్‌ ట్విట్టర్‌ వేదికగా సూర్య దేవాలయాన్ని గుర్తించి, పరిరక్షించాలని గతంలో పురావస్తు శాఖ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం, పురావస్తు సలహాదారు ఎస్‌.రుషి కేష్తో పాటు పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం దేవాలయాన్ని సందర్శించింది. ఆలయం చారిత్రక ప్రాముఖ్యత, స్వభావం, నిర్మాణం యొక్క స్థితిని బృందం పరిశీలించింది.

అన్ని పారిమితులకు అనువుగా ఉన్నట్లు గుర్తించిన పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం కేంద్ర ప్రభుత్వ రక్షణ జాబితాలో స్థానం కోసం గట్టిగా సిఫార్సు చేశారు. ఆలయ రక్షణ, పునర్ని ర్మాణం కొసం గ్రామస్థులు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. లేఖకు స్పందించిన మంత్రి.. ఆలయ అభివృద్ధి కోసం ఈ లేఖను సంబంధిత శాఖకు పంపి, నిబంధనల ప్రకారం ఆలయ రక్షణకు సరైన చర్యలు తీసుకోమని సూచించినట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement