Wednesday, April 24, 2024

Telangana: చార్జీల పెంపుపై ఆర్టీసీ కసరత్తు.. ఇవీ ప్రతిపాదనలు

తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. నష్టాల కారణంగా సామాన్యులపై భారం మోపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఇటీవల చార్జీల పెంపుకు సంబంధించిన నాలుగు రకాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఆర్టీసీ పంపింది. కిలీ మీటర్ కు 15 పైసలు, 20 పైసలు, 25 పైసలు, 30 పైసలు.. ఇలా దేని ప్రకారం ఎంత ఆదాయం పెరుగుతుందనే లెక్కలు అందించారు.

రెండేళ్ల క్రితం ఆర్టీసీలో సమ్మె తర్వాత 2019 డిసెంబరులో ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను సవరించింది. అప్పట్లో కిలోమీటరుకు 20 పైసల మేర పెంచింది. అయితే, ఇప్పుడు ఎంత శాతం పెంచుతారు ? అనేది ఉత్కంఠగా మారింది. 20 పైసలు పెంచితే రూ.625 కోట్ల ఆదాయం పెరుగుతుందని, 25 పైసలు పెంచితే దాదాపు రూ.750 కోట్లు పెరుగుతుందని, 30 పైసలైతే రూ.900 కోట్లకు పైగా పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు లెక్కలు వేశారు. ఇందులో కి.మీ.కు 25 పైసలు పెంచే ప్రతిపాదన అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. 30 పైసలైతే ప్రజలు భారంగా భావించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మధ్యేమార్గంగా 25 పైసల పెంపుపై సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు నాలుగు ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమర్పించారు. పెంపునకు ప్రభుత్వం కూడా సాను కూలంగానే ఉందన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. వారం పదిరోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: పార్టీలో మార్పులు చేయాల్సిందే.. టీ. కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్సీ అల్టీమేటం!

Advertisement

తాజా వార్తలు

Advertisement