Wednesday, March 27, 2024

నిర్మాత బెల్లంకొండ సురేష్‌, అతని కొడుకు శ్రీనివాస్​పై చీటింగ్‌ కేసు నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌, ఆయన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్‌పై బంజారాహిల్స్‌, సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. బెల్లంకొండ సురేష్‌, శ్రీనివాస్‌ తమ దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని శ్రవణ్‌ కుమార్‌ అనే వ్యాపారి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు బెల్లంకొండ సురేష్‌, ఆయన తనయుడిపై కేసు నమోదు చేశారు. 2018లో సినీ డైరెక్టర్‌ మధునేని గోపీచంద్‌ దర్శకత్వంలో నిర్మించిన సినిమాకు డబ్బులు కావాలని దాదాపు రూ.85 లక్షలు తీసుకున్నారని శ్రవణ్‌ కోర్టుకు తెలిపారు. తీసుకున్న డబ్బులు అప్పటి నుంచి తిరిగి ఇవ్వడం లేదని డబ్బులు కావాలని కోరితే ఆ సినిమాకు సహ నిర్మాతగా ఉండాలని లాభాలు వస్తే వాటా ఇస్తామని చెప్పిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటి వరకు ఆ సినిమా తెరకెక్కకపోవడం, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో శ్రవణ్‌ కుమార్‌ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు.

బాధితుని పిటీషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం బెల్లంకొండ సురేష్‌, శ్రీనివాస్‌పై కేసు నమోదు చేయాలని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌ కథా నాయకుడిగా చత్రపతి సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్‌ డైరెక్టర్‌ వివి వినాయక్‌ దర్శకత్వం వహిస్తుండగా పెన్‌ స్టూడియోస్‌ నిర్మిస్తోంది. టైగర్‌ నాగేశ్వర్‌రావు ఆత్మకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న స్టువర్టుపురం దొంగ సినిమాలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement