Friday, April 19, 2024

కేన్స్‌లో పూజా హెగ్డేకి చేదు అనుభ‌వం.. అన్నీ పోగొట్టుకుని ఒంట‌రిగా మిగిలాన‌న్న బ్యూటీ!

సౌథ్ ఇండియ‌న్ మూవీస్‌లో క్రేజీ హీరోయిన్ గా పేరుగాంచిన కన్నడ బ్యూటీ పూజా హెగ్డే ప్రఖ్యాత కేన్స్ చలనచిత్రోత్సవంలో తళుక్కుమంది. తొలిసారి కేన్స్ లో రెడ్ కార్పెట్ పై నడిచి మురిసిపోయింది. అయితే.. కేన్స్ లో ఈ అమ్మడికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. తన బృందంతో సహా భారత్ నుంచి బయల్దేరి కేన్స్ వచ్చిన పూజా హెగ్డే… అనుకోని రీతిలో తన దుస్తులు, ఫ్యాషన్ నగలు, మేకప్ సామాన్లు పోగొట్టుకుంది. ఈ విషయాన్ని పూజానే స్వయంగా వెల్లడించింది. “మేం అన్నీ పోగొట్టుకున్నాం. ఫ్యాషన్ దుస్తులు, మేకప్ కిట్లు ఏవీ లేకుండా పోయాయి. కేన్స్ లో దిగామో లేదో మాపై బండ పడినట్టు అయ్యింది. బాధపడేందుకు కూడా సమయంలేని పరిస్థితి. వెంటనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ వాకింగ్ కు సిద్ధం కావాల్సి ఉంది. ఈ పరిణామంతో నాకంటే మా మేనేజర్ ఎక్కువగా ఆందోళనకు గురయ్యారు.

నేనైతే… జరిగిందేదో జరిగిపోయింది అనుకున్నాను. అయితే నాతో పాటే కొన్ని ఒరిజినల్ నగలను ఉంచుకోవడం ఊరట కలిగించే అంశం. దాంతో కేన్స్ లోనే దుస్తులు తెప్పించుకుని మేనేజ్ చేశాను. అని పూజా తెలిపింది. ఈ సందర్భంగా త‌న టీమ్ కనీసం భోజనం కూడా చేయలేదని, త‌ను రెడ్ కార్పెట్ వాకింగ్ పూర్తి చేసేవరకు వాళ్లు పచ్చి మంచినీళ్లు ముట్టలేదని తెలిపింది ఈ అమ్మ‌డు. ఇక‌.. అన్నీ పోయాయని తెలియగానే వాళ్లు హుటాహుటీన వెళ్లి దుస్తులు, మేకప్ సామ‌న్లు, కొత్త హెయిర్ ప్రొడక్టులు తీసుకువచ్చి త‌న‌ను సిద్ధం చేశార‌ని వెల్ల‌డించింది. త‌నైతే ఆ రోజు తిండి తినేసరికి రాత్రి అయ్యింద‌ట‌. ఓవైపు హెయిర్ స్టయిలిస్ట్ కి ఫుడ్ పాయిజనింగ్ కావడం మరో బాధాకరమైన అంశంగా పేర్కొంది. అయినప్పటికీ కేన్స్ రెడ్ కార్పెట్ మీద త‌ను అందంగా కనిపించేందుకు వారు ఎంతో శ్రమించారు. త‌ను కేన్స్ రెడ్ కార్పెట్ పై అడుగుపెట్టానంటే అది వాళ్ల వల్ల‌నే అని పూజా హెగ్డే వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement