Thursday, April 25, 2024

Space Tourism | అంతరిక్ష పర్యాటకంలో ముందగుడు.. సేఫ్‌గా ల్యాండ్‌ అయిన హ్యాలో స్పేస్​ వేహికల్​

వికారాబాద్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: అంతరిక్ష పర్యాటకానికి సంబంధించి జరుగుతున్న పరిశోధనల్లో కీలక ముందడుగు పడినట్లు తెలుస్తోంది. ఈ దిశగా హ్యాలో (హెచ్‌ఏఎల్‌వో) స్పేస్‌ అనే సంస్థ కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తోంది. అంతరిక్ష పర్యాటకాన్ని చేపట్టేందుకు సిద్ధం చేసిన నమూనా వాహనం (ప్రోటోటైప్‌) ఒకటి బుధవారం జిల్లాలో ల్యాండ్‌ అయ్యింది. పంట పొల్లాలో దిగిన ఈ స్పేస్​ క్రాఫ్ట్​తో​ కొద్దిసేపు తీవ్ర కలకలం రేపింది. అది భారీ ఆకారంలో ఉండడంతో పాటు నలుదిక్కులా కెమెరాలు.. లోపలికి వెళ్లడానికి తలుపులు ఉన్నాయి. ఈ వాహనం జిల్లాలోని మర్పల్లి మండలం మొగిలిగుండ్ల అటవీ ప్రాంతంలో ఉన్న పొలాల్లో దిగింది. ఈ విషయం తెలుసుకొన్న ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా అక్కడికి వచ్చి రక్షణగా నిలిచారు.

పంట పొలాల్లో దిగిన వాహనంపై హ్యాలో స్పేస్‌ అని రాసి ఉంది. అంతరిక్ష పర్యాటకంపై స్పెయిన్‌లో హ్యాలో స్పేస్‌ అనే సంస్థ పరిశోధనలు చేస్తోంది. ఇటీవల అంతరిక్షంలో అంటే భూమికి 6 నుంచి 20 కిలోమీటర్ల ఎత్తులో ఉండే స్టాటోస్పియర్‌లో ప్రయాణించేందుకు వీలుగా ఒక వాహనాన్ని (ప్రోటోటైప్‌)ను గత నెలలో ఈ సంస్థ సిద్ధం చేసింది. ఈ స్పేస్​ క్రాఫ్ట్​ని మొత్తం 8 మంది, ఒక పైలెట్‌ ప్రయాణించేందుకు వీలుగా రూపొందించారు. నారింజ పండు మాదిరిగా దీనిని సిద్ధం చేశారు. వాహనంలో కూర్చొని పర్యాటకులు స్టాటోస్పియర్‌లోని అందాలను వీక్షించవచ్చు. హ్యాలో స్పేస్‌ సంస్థ సిద్ధం చేసిన నమూనా వాహనాన్ని ప్రయోగం నిమిత్తం హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టిఐఎఫ్‌ఆర్‌)కు కొద్ది రోజుల క్రితం తరలించారు.

కాగా, ఈ నమూనా వాహనాన్ని బుధవారం ప్రయోగించారు. మొదటి ప్రయాణం కావడంతో మనుషులు లేకుండానే ప్రయోగం చేశారు. అయితే.. దీని సేఫ్‌ ల్యాండింగ్‌పై ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇవ్వాల చేసిన ప్రయోగం విజయవంతం అయినట్లు తెలుస్తోంది. జిల్లాలోని మర్పల్లి మండలం మొగిలిగుండ్ల గ్రామ సమీపంలో నమూనా వాహనం సేఫ్‌గా ల్యాండ్‌ అయ్యింది. దీని పైభాగంలో ఉన్న బెలూన్‌ ఆధారంగా కిందకు ఒక్కసారిగా పడిపోకుండా సేఫ్​గానే ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. ఇక.. ఇది ల్యాండ్‌ అయిన ప్రదేశానికి టాటా సంస్థ ప్రతినిధులు వచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement