Friday, March 29, 2024

మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

చమురు కంపెనీలు వాహనదారులకు మళ్లీ షాక్‌ ఇచ్చాయి. మంగళవారం మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచాయి. ఒక రోజు విరామం అనంతరం ధరలు పైకి కదిలాయి. గత కొద్ది రోజులుగా కంపెనీలు రోజు విడిచి రోజు పెంచుతూ వస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు చమురు కంపెనీలు పదిసార్లు ధరలను పెంచాయి. ఓ వైపు కరోనా మహమ్మారి సమయంలో ఇంధన ధరలు గత కొద్ది రోజులుగా పైపైకి వెళ్తుండడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 27 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 31 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.58, డీజిల్‌ రూ.83.51కు చేరింది. మరో వైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వందకు చేరువైంది. ప్రస్తుతం పెట్రోల్‌ రూ.99.14, డీజిల్‌, రూ.90.71కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.92.92, డీజిల్‌ రూ.86.35, చెన్నైలో పెట్రోల్‌ రూ.94.54, డీజిల్‌ రూ.88.34, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.96.50, డీజిల్‌ రూ.91.04, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.99.30, డీజిల్‌ రూ.92.18, బెంగళూరులో పెట్రోల్‌ రూ.95.94, డీజిల్‌ రూ.88.53కి చేరాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో అత్యధికంగా రికార్డు స్థాయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.103.80, డీజిల్‌ రూ.96.30 చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement