ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల పీఆర్సీ రగడ కొనసాగుతోంది. హైకోర్టు వరకు చేరింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ, సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ హైకోర్టులో పిటిషన్ వేసింది. విభజన చట్ట ప్రకారం ఎలాంటి సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించకూడదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోల్ని రద్దు చేయాలంటూ పిటిషన్లో కోరింది. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా… పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. లంచ్ బ్రేక్ టైమ్లో ధర్నా చేపట్టారు. మూడవ బ్లాక్ ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సెక్రటేరియట్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకుని.. తమకు న్యాయమైన హెచ్ఆర్ఏ, సీసీఏలతో కూడిన జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఆందోళనలు విరమించబోమంటున్నారు. ప్రభుత్వం రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..