Saturday, March 23, 2024

రాజ‌కీయ నాయ‌కులు మాట త‌ప్పారా.. అంతే సంగ‌తులు

మాట త‌ప్పిన రాజ‌కీయ నాయ‌కుడిని శిక్షిస్తార‌ట అక్క‌డి ప్ర‌జ‌లు..ఇంత‌కీ ఎక్క‌డ అనుకుంటున్నారా..ఇటలీలోని ఓ పట్టణంలో.
ఏడాది పొడవునా తప్పులు చేసిన రాజకీయ నాయకులను గుర్తించి వారిని శిక్షించేందుకు జూన్ లో ఓ వేడుక నిర్వహిస్తారు. టోంకాగా పిలిచే ఈ వేడుకలో నాయకులను శిక్షించే పద్ధతి కూడా వెరైటీగా ఉంటుంది.తమ బాగోగులు చూడడానికి ప్రజలు ఎన్నుకున్న నాయకులు బాధ్యతారహితంగా ప్రవర్తించినా, ప్రజాసేవ మరిచినా.. తర్వాతి ఎన్నికలలో ప్రజలు వారిని ఓడిస్తారు. ప్రపంచంలో జరిగేది ఇదే.. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ప్రజలకే జవాబుదారీగా ఉండాలని ఇటలీ ప్రజలు అంటున్నారు.

బాధ్యతలు మరిచిన నేతలకు వాటిని గుర్తుచేయాల్సిన బాధ్యత కూడా ప్రజలదేనని చెబుతున్నారు.ఇటలీలోని ట్రెంటో అనే పట్టణంలో ఏటా జూన్ లో ఓ వింత వేడుక జరుగుతుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చని నేతలను, తప్పుచేసిన రాజకీయ నాయకులను శిక్షించడమే ఈ వేడుక ఉద్దేశం. టోంకాగా వ్యవహరించే ఈ కార్యక్రమంలో నాయకులను చెక్కబోనులో బంధిస్తారు. ఆపై వాటిని క్రేన్ సాయంతో సమీపంలోని నదిలో ముంచేస్తారు. ఈ తతంగమంతా జరిగేది కాసేపే అయినా రాజకీయ నాయకులు తమ తప్పొప్పులు తెలుసుకోవడానికి, ప్రజలకు జవాబుదారీగా నడుచుకోవడానికి ఇలా చేస్తామని స్థానికులు చెబుతున్నారు. ఈ శిక్షా కార్యక్రమాన్ని వారు కోర్ట్ ఆఫ్ పెనింటెన్స్ గా పిలుచుకుంటారు. పట్టణంలోని ప్రముఖులను ఈ కోర్టులో విచారించి, తప్పుచేసిన వాళ్లకు శిక్ష విధిస్తారు. దాంతో రాజ‌కీయ‌నాయ‌కులు త‌ప్పుచేయ‌డానికి భ‌య‌ప‌డాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement