Saturday, April 20, 2024

Farmers: తెలంగాణ తరహాలోనే రైతాంగ‌ పోరాటం.. రైతు వ్యతిరేకులతోనే జైకిసాన్​ అనిపిద్దాం: సీఎం కేసీఆర్‌

ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన పంథానే దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి అనుసరించడం ద్వారానే గమ్యాన్ని చేరుకోగలమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేకులతో నాడు ‘జై తెలంగాణ’ నినాదాన్ని అనిపించినట్టే.. నేడు రైతు వ్యతిరేకులతో ‘జై కిసాన్ నినాదాన్ని పలికించాలన్నారు. ఆ దిశగా దేశంలోని రైతు నేతలంతా ఐక్య సంఘటన కట్టి, ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

ఈ దేశ రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం అని, రైతు బాగుంటెనే వ్యవసాయం బాగుంటదని, వ్యవసాయం బాగుంటేనే సమాజం బాగు పడతదని సీఎం అన్నారు. ఈ దేశంలో రైతు మర్యాదను నిలబెట్టి, ఆత్మ గౌరవం కాపాడేందుకు కలిసి పనిచేద్దా’మని.జాతీయ రైతు నేతలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

వ్యవసాయ రంగ సమస్యలు – పరిష్కారాలపై సుదీర్ఘ చర్చ
ఈ సందర్భంగా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాల వల్ల భవిష్యత్ దేశీయ వ్యవసాయ రంగం కునారిల్లిపోనున్న ప్రమాదకర పరిస్థితుల్లో ఈ సమస్యలకు కారణాలు, వాటి పరిష్కార మార్గాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. పలు రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నేతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. స్వాతంత్ర్య కాలం నుంచి నేటి వరకూ దేశంలో జరిగిన రైతాంగ పోరాటాలను, అందుకు నాయకత్వం వహించిన నేతలు, వారు అవలంభించిన విధానాలు, పోరాట రూపాలను చర్చించారు. నాటి వ్యవసాయ పరిస్థితులకు, మారిన నేటి పరిస్థితులకు అవలంభించాల్సిన ఉద్యమ కార్యాచరణ విధి విధానాలను, పోరాట రూపాల బ్లూ ప్రింట్ ను తయారు చేసి దేశ రైతాంగాన్ని సంఘటితం చేసే దిశగా చర్యలు ప్రారంభించాలని, అందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్దం చేయాలని, సీఎం కేసీఆర్ ను కోరుతూ సమావేశంలో సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

జట్టుకట్టి, పట్టు పడితే.. సాధించలేనిది ఏమీ లేదు…
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘వ్యవసాయం ఈ దేశ ప్రజల జీవన విధానమని, వ్యవసాయాన్ని ఈ దేశం నుంచి ఎవరూ వేరు చేయలేరు. రైతన్నలో శక్తి గొప్ప శక్తి దాగి ఉంటది. దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉన్నది. మన సమస్యలకు పరిష్కారాన్ని మనమే అన్వేషించాలి. జట్టు కట్టి పట్టు పడితే సాధించలేనిది ఏమీ లేదని నేను స్వయంగా ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం, లక్ష్యాన్ని సాధించి రుజువు చేసింది. నాకంటే ముందు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. కానీ, నిర్దిష్ట పరిస్థితులకు అనుసరించాల్సిన నిర్దిష్ట కార్యాచరణ కొరవడటంతో ఆనాడు లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు పలు రంగాలకు చెందిన మేధావులతో కొన్ని వేల గంటల మేధో మధనం చేసిన. తెలంగాణ పోరాటాలు విఫలం చెందడానికి కారణాలను అన్వేషించిన. ఆఖరి పోరాటం ఆగం కాకూడదనే దృఢ సంకల్పంతో, మొహమాటాలకు, బేషజాలకు తావు లేకుండా అటు రాజకీయ పంథాకు,ఇటు ఉద్యమ పంథాను సమన్వయం చేసుకుంటూ జమిలి పోరాటాలతో ముందుకు సాగాలనే తుది నిర్ణయం తీసుకోవడం ద్వారా గమ్యాన్ని ముద్దాడినం.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

- Advertisement -

రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వాములు కావాలి..
రాజకీయాలంటే అయోమయం అవసరం లేదు. మొహమాటాల నుంచి రైతు నేతలు బయటపడి రాజకీయాలనే పవిత్ర యజ్ఞంలో భాగస్వాములై, దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయా సందర్భాలను బట్టి, నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణను అనుసరిస్తూ, అవసరమైన చోట ఉద్యమ పంథాను కూడా కొనసాగిస్తూ సాగే, ప్రజాస్వామిక పార్లమెంటరీ పంథా ద్వారా మాత్రమే ప్రజాస్వామిక దేశాల్లో ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకు తెలంగాణ రాష్ట్ర సాధనే నిదర్శనమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ‘‘ఎక్కడ ఆందోళన అవసరమైతదో అక్కడ ఆందోళన చేద్దాం – ఎక్కడ రాజకీయాలు అవసరమైతయో అక్కడ రాజకీయాలు చేద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. మన శక్తిని మనం గుర్తించడంలో వెనుకబడి ఉన్నాం. రాజకీయాల్లో ఉండటం అపవిత్రం అనుకోవడం సరికాదు.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

సీఎం కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే నడుద్దాం..
ఈ సందర్భంగా పంజాబ్, ఉత్తర ప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన సీనియర్ రైతులు మాట్లాడుతూ ‘‘మనం ఇన్నాళ్లూ రైతు సమస్యల పరిష్కారానికి కేవలం ఆందోళనలు, ఉద్యమాలే శరణ్యం అనుకొని మన జీవితాలను మార్చే రాజకీయాలను విస్మరించాం. ఇకనుంచీ సీఎం కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే కలిసి నడుద్దాం. ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, దేశ రైతాంగ సమస్యలకు పరిష్కారాలను సాధించుకుందాం’’ అని దేశ రైతాంగానికి పిలుపునిచ్చారు.

దేశ రైతు ఒక్క ఎకరం భూమి కూడా కోల్పోవద్దు..
నూతన వ్యవసాయ చట్టాల పేరుతో, కరంటు మోటార్లకు మీటర్లు పెట్టి, రవాణా చార్జీలను పెంచి, ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తూ, రైతు పంటల ఎగుమతులు, దిగుమతుల్లో అసంబద్ధ విధానాలను అవలంభిస్తూ, కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నదని సమావేశం అభిప్రాయపడింది. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి, సన్నకారు రైతుల నోళ్లు కొట్టి, కార్పొరేట్ గద్దలకు దేశీ వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పేందుకు కుట్ర జరుగుతున్నదని, దీన్ని తిప్పికొట్టాలని, ఒక్క ఎకరం కూడా దేశ రైతు తన భూమిని కోల్పోకుండా కాపాడుకుంటాం.. అని సమావేశం తీర్మానం చేసింది. రైతు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని నమ్మబలుకుతూ.. మండీలను ఖతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి, దేశ ప్రధాని నరేంద్ర మోడీతో స్వయంగా క్షమాపణలు చెప్పించిన ఘనత భారత దేశ రైతాంగానికి చెందుతుందని పంజాబ్ కు చెందిన సీనియర్ రైతులు ఈ సందర్భంగా అభిప్రాయ పడ్డారు.

తెలంగాణ రైతు పథకాలు దేశమంతటా అమలు చేయాలి
దళిత బంధు సహా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు తదితర వ్యవసాయ అభివృద్ధి, రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు కేంద్రంలోని పాలకుల్లో భయాన్ని సృష్టిస్తున్నాయని, కానీ వీటిని దేశవ్యాప్తంగా అమలు పరచడం అనేది చిత్తశుద్ధి ఉంటే సాధ్యమయ్యేదేనని వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు అభిప్రాయ పడ్డారు.

సీఎం కేసీఆర్ దార్శనికతతోనే ప్రశాంతంగా తెలంగాణ..
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, కృషి వల్లనే శాంతి ఫరిఢవిల్లుతున్నదని, ఇటీవల పెచ్చరిల్లుతున్న మత విద్వేషాల ప్రభావం తెలంగాణ పైన, హైదరాబాద్ పైన పడలేదనే విషయాన్ని మేం గ్రహించామని, ఇది నిజంగా బీజేపీ మతతత్వ శక్తులకు సరైన గుణపాఠంగా నిలిచిందని సమావేశంలో పాల్గొన్న రైతులు స్పష్టం చేశారు.

జాతీయ రైతు సంఘాల నేతలను సన్మానించిన సీఎం కేసీఆర్..
జాతీయ రైతు సంఘాల నేతలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్ రెడ్డి, బాల్క సుమన్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డితోపాటు దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన 100 మంది రైతులు పాల్గొన్నారు. కాగా, మూడు రోజులపాటు తెలంగాణలో సాగిన ‘జాతీయ రైతు సంఘాల నేతల పర్యటన’ నేటితో ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement