Saturday, April 20, 2024

కేటీఆర్‌కు వైట్ ఛాలెంజ్ విసిరిన రేవంత్

తెలంగాణలో సంచలనం రేపిన డ్రగ్స్  కేసుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ ప్రకటించారు. ఇందు కోసం తన బ్లడ్, వెంట్రుకల శాంపిల్స్ ను డాక్టర్లకు ఇస్తానన్నారు. ఎంపీ సంతోష్ రావు గ్రీన్ ఛాలెంజ్ లా .. తాను వైట్ ఛాలెంజ్ చేస్తున్నానని అన్నారు. మంత్రి కేటీఆర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన వైట్ ఛాలెంజ్ స్వీకరించాలన్నారు. వాళ్లిద్దరు తన ఛాలెంజ్ స్వీకరించి మరో ఇద్దరికి ఛాలెంజ్ చేయాలన్నారు. రాష్ట్రం డ్రగ్స్ బారిన పడకుండా ఉండడం కోసమే ఈ వైట్ ఛాలెంజ్ అని రేవంత్ పేర్కొన్నారు. 

కేటీఆర్ చెప్పేవి శ్రీ‌రంగ నీతులన్న రేవంత్.. త‌ప్పు చేయ‌న‌ప్పుడు ఈడీ ఎక్సైజ్ శాఖ‌ను వివ‌రాలు అడిగితే ఎందుకు ఇవ్వ‌టం లేద‌ని ప్రశ్నించారు. వివ‌రాలు ఇస్తే అస‌లు విష‌యం బ‌య‌ట‌కొస్తుంద‌ని భ‌యమాఅని నిలదీశారు. ఎక్సైజ్ విచారణలో రానా, రకుల్ ప్రీత్ సింగ్ లేరని, కానీ వాళ్లను ఈడీ అధికారులు విచారణకు పిలిచారన్నారు. వాళ్ళను కాపాడింది ఎవరు అని రేవంత్ ప్ర‌శ్నించారు. రకుల్ ప్రీత్ సింగ్, రానా పేర్లు వస్తే ఎందుకు కేటీఆర్ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. వైట్ ఛాలెంజ్ లో భాగంగా సోమవారం రోజు గన్ పార్క్ అమర వీరుల స్థూపం వద్దకు వస్తా.. కేటీఆర్, కొండా రండి.. ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుందామ‌ని రేవంత్ స్ప‌ష్టం చేశారు.

బీజేపీ రిమోట్ కేసీఆర్ చేతుల్లో ఉందని ఆరోపించారు. 8 ఏళ్లైనా బీజేపీ ఇప్పటి వరకు పునర్విభజన చట్టంపై మాట్లాడలేదని చెప్పారు. బీజేపీ నేతలకు రాంజీగోండు చరిత్ర తెలియదన్నారు. గోండుల పట్ల ఆదివాసుల పట్ల బీజేపీ నేతలకు చిన్న చూపని చెప్పారు.

ఇది కూడా చదవండిః మందుబాబులకు షాక్.. మద్యం దుకాణాలు బంద్

Advertisement

తాజా వార్తలు

Advertisement