Friday, April 19, 2024

జనసేన పార్టీకి ఊహించని దెబ్బ

పవన్ కళ్యాణ్‌ జనసేన పార్టీకి ఊహించని ఎదరుదెబ్బ తగిలింది. తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు త్వరలో జరగబోయే ఎన్నికల పోటీలో జనసేన తమ సింబల్ ‘గాజుగ్లాస్’ను కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనీసం 10 శాతం సీట్లకు పోటీచేయని కారణంగా పార్టీలు కామన్‌ గుర్తులను కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ వెల్లడించారు. జనసేనతో పాటు ఎంసీపీఐ (యూ)-( గ్యాస్‌ సిలిండర్‌), ఇండియన్‌ ప్రజా పార్టీ (ఈల), ప్రజాబంధు పార్టీ (ట్రంపెట్‌), హిందుస్థాన్‌ జనతా పార్టీ (కొబ్బరి తోట) పార్టీలు కూడా తమ కామన్‌ గుర్తులను కోల్పోయాయి. కాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా పోటీ నుంచి జనసేన తప్పుకుంది. ఇదే విషయాన్ని ఎస్ఈసీకి పవన్ కళ్యాణ్ లేఖ కూడా రాశారు.

తెలంగాణలో త్వరలో ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీల్లో పోటీచేయాలని జనసేన భావిస్తూ ఉండగా.. తమ అభ్యర్థులకు ‘గాజుగ్లాసు’ కామన్‌ సింబల్‌ను కొనసాగించాలని జనసేన పార్టీ ఎస్‌ఈసీని కోరింది. అయితే జనసేన సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు సంతృప్తికరంగా లేకపోవడంతో విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. జనసేనతో సహా ఇతర పార్టీలు 2025 నవంబర్‌ 18 వరకు కామన్‌ సింబల్‌ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement