Wednesday, April 24, 2024

టీఆర్ఎస్ లో కౌశిక్‌ రెడ్డికి ఉజ్వల భవిష్యత్‌: సీఎం కేసీఆర్ హామీ

తెలంగాణ రాష్ట్రాభివృద్ధిని ఆకాంక్షిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన కౌశిక్‌ రెడ్డికి ఉజ్వల భవిష్యత్‌ ఉందని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. కౌశిక్‌రెడ్డి భవిష్యత్‌కు మంచి మార్గం ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. హుజురాబాద్‌ కు చెందిన కీలక నేత, టీపీసీసీ మాజీ కార్యదర్శి పైడి కౌశిక్‌ రెడ్డి బుధవారం సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన వారికి స్వాగతం పలికారు. మలిదశ ఉద్యమంలో కౌశిక్‌రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి తనతోని భుజం కలిపి పనిచేసినట్లుగా సీఎం గుర్త చేశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యమం కొనసాగించామన్నారు. ప్రొ.జయశంకర్‌ సలహాలతో ఉద్యమాన్ని నడిపి.. రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక విపత్కర పరిస్థితి ఉండేదన్నారు. కరెంట్‌ కోతలు, తాగేందుకు మంచినీళ్లు లేవు, చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. అవగాహనతో ఒక్కో సమస్యను అధిగమిస్తూ వచ్చామని వివరించారు. ప్రస్తతం తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. గొర్రెల పంపిణీ అంటే పప్పు, బెల్లం లాంటి పథకం కాదన్నారు. తెలంగాణ రైతులు 3 కోట్ల టన్నుల ధాన్యం పండించారని, 90 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్‌సీఐకి ఇచ్చినట్లు చెప్పారు. రైతుబంధుపై కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయని  తెలిపారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఓడడం, గెలవడం నిరంతర ప్రక్రియ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దారెటు?

Advertisement

తాజా వార్తలు

Advertisement