Thursday, April 25, 2024

ఒప్పోతో జియో డీల్‌.. రెనో 7 సిరీస్‌లో 5జీ ట్రయల్స్‌

దేశంలో అతిపెద్ద మొబైల్‌ నెట్‌వర్క్‌ కంపెనీగా గుర్తింపు పొందిన రిలయన్స్‌ జియో.. ఈ రంగంపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నది. ఆ దిశగా ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే అన్ని టెలికాం కంపెనీల కంటే ముందు వరుసలో ఉంది. 5జీ సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. వెయ్యి నగరాలకు ఈ నెట్‌వర్క్‌ పరిధిలోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకున్నట్టు కూడా రిలయన్స్‌ జియో ప్రకటించింది.

ఫైబర్‌ కెపాసిటీ పెంపుపై దృష్టి
ఈ పరిణామాల మధ్య.. రిలయన్స్‌ జియో కొత్తగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌లు తయారు చేసే ఒప్పోతో ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్‌ ఫోన్స్‌లో 5జీ స్టాండ్‌ అలోన్‌, నాన్‌ స్టాండ్‌ అలోన్‌ నెట్‌వర్క్‌ ట్రయల్స్‌ను నిర్వహించడానికి డీల్‌ కుదుర్చుకున్నట్టు రిలయన్స్‌ జియో తెలిపింది. ఒప్పో తయారు చేసిన రెనో 7 సిరీస్‌లో 5జీ నెట్‌వర్క్‌ వినియోగానికి సంబంధించిన ట్రయల్స్‌ను నిర్వహించేందుకు రిలయన్స్‌ జియో సిద్ధమైంది. 3.3-3.6 గిగా హెర్జ్‌ ఫ్రీక్వెన్సీ రేంజ్‌తో 5జీ నెట్‌వర్క్‌.. స్మార్ట్‌ ఫోన్స్‌లో బఫర్‌ లేకుండా ఎలా పని చేస్తుందనేది రెనో 7 సిరీస్‌ మోడల్స్‌లో పరీక్షిస్తారు. 5జీ ట్రయల్స్‌ విషయంలో.. అవసరమైన ఫైబర్‌ కెపాసిటీని పెంచుకోవడంపై ప్రస్తుతం దృష్టి సారించామని, ఎంపిక చేసిన వెయ్యి నగరాల్లో దీనికి సంబంధించిన పైలట్‌ ప్రాజెక్టును నిర్వహిస్తామని రిలయన్స్‌ జియో వివరించింది.

1000 నగరాల్లో ట్రయల్స్‌
5జీ నెట్‌వర్క్‌ను విస్తరింపజేయడానికి ప్రత్యేకంగా డెడికేటెడ్‌ సొల్యూషన్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 1000 నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ కవరేజ్‌ పూర్తయ్యింది. ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్‌ దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. హెల్త్‌కేర్‌, ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ టెక్నాలజీతో రిలయన్స్‌ జియో దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 1000 నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ సేవలను అందించడానికి కసరత్తు చేస్తోంది. నెట్‌వర్క్‌ ప్లానింగ్‌లో 3డీ మ్యాప్స్‌, రే ట్రేసింగ్‌ టెక్నాలజీ వంటి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంస్థ వినియోగిస్తున్నది. కేంద్రం నుంచి అనుమతులు రాగానే.. దీన్ని ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకుంటున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5జీ స్పెక్ట్రమ్‌ను కేంద్ర ప్రభుత్వం వేలం వేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తన నెట్‌వర్క్‌ ట్రయల్స్‌ను శరవేగంగా పూర్తి చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement