Thursday, April 25, 2024

Bharath jodo: బీజేపీ, టీఆర్​ఎస్​ పాలనలో ఏ ఒక్కరూ హ్యాపీగా లేరు: రాహుల్​ గాంధీ

దేశంలో బీజేపీ, తెలంగాణలో టీఆర్​ఎస్​ ప్రభుత్వాలతో ప్రజలు హ్యాపీగా లేరని, ఏ ఒక్కరూ సంతోషంగా లేరని విమర్శించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. భారత్​ జోడో యాత్రలో భాగంగా ఇవ్వాల (శనివారం) రాత్రి సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్​ జంక్షన్​లో ఏర్పాటు చేసిన కార్నర్​ మీటింగ్​లో ప్రసంగించారు. 2014 తర్వాత కేంద్రంలో ప్రధాని మోదీ, తెలంగాణలో సీఎం కేసీఆర్​ నిరుద్యోగ సమస్యను తీవ్రం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను మోదీ ప్రైవేట్​కు అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని రాహుల్​ గాంధీ మండిపడ్డారు. తెలంగాణలో రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా మారిందన్నారు. ప్రాజెక్టుల పేరుతో భూములను లాక్కుంటూ సీఎం కేసీఆర్​ రైతుల గొంతునొక్కుతున్నారని, కేంద్రం తీసుకురావాలనుకున్న రైతు వ్యతిరేక చట్టాలకు టీఆర్​ఎస్​ మద్దతు ఇచ్చిందని విమర్శలు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో ప్రస్తుతం గ్యాస్​ సిలిండర్​ ధర 400 రూపాయల నుంచి 11 వందలకు పూగా చేరిందని, పెట్రోల్​ ధర 110 రూపాయలకు పెరిగిందని, దీంతో పేదలు మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విద్వేషం, హింస, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఈ జోడో యాత్ర చేపట్టామని, ప్రజల ప్రేమ, ఆప్యాయత వల్ల పాదయాత్రలో ఎట్లాంటి అలసట రావడం లేదని రాహుల్​ అన్నారు. రైతులు, యువత, విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల యాజమానుల సమస్యలను తెలుసుకుంటూ యాత్రలో ముందుకు వెళ్తున్నారు రాహుల్​.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement