Friday, March 15, 2024

విద్యుత్ ఛార్జీలు య‌ధాత‌థం….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విద్యుత్‌ వినియోగదారులపై కరెంట్‌ చార్జీల భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుతం అమల్లో ఉన్న టారీఫ్‌నే అమలు చేస్తోంది. కేవలం ప్రార్థన మందిరాలకు, గతంలో అధికంగా ఉన్న కరెంట్‌ చార్జీలను లోడ్‌తో సంబంధం లేకుండా యూనిట్‌ సరఫరా ధరను రూ.5గా నిర్ణయించారు. ఇంతకు మించి వచ్చే ఆర్థిక సంవ త్సరం టారీఫ్‌ ఆర్డర్‌లో ఎలాంటి మార్పు లేదు. 2022-23లో కరెంట్‌ చార్జీలు పెంచినా విద్యుత్‌ సంస్థలు 2023-24లో చార్జీల పెంపుపై ప్రతిపాదనలు చేయలేదు, దాన్ని యదావిధిగా తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం ఈఆర్‌సీ చైర్మన్‌ శ్రీరంగారావు, సభ్యులు మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్య ప్రకటించారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల ఆదాయం లోటు రూ.10,890.51 కోట్లు ఉంటుందని వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనలో (ఏఆర్‌ఆర్‌) ప్రతిపాదించాయి. దాన్నీ పరిశీలించిన కమిషన్‌ ఆదాయ లోటు రూ.9,124.82 కోట్లుగా ఉంటుందని నిర్దారించి ఆమోదించింది. అలాగే విద్యుత్‌ కొనుగోలు ధరను 2022-23లో యూనిట్‌కు రూ.4.49 పైసలుగా నిర్దారించగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.4.39 పైసలుగా ప్రకటించారు. కాస్ట్‌ ఆఫ్‌ సర్వీస్‌ కూడా రూ.7.03 పైసల నుంచి రూ. 7.02 పైసలుగా నిర్దారించారు. 2023-24లో రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ.9,124.82 కోట్లు సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. దీనిలో ఎల్‌టీ-1 కేటగీరి గృహ వినియోగ నిధికి సంబంధించిన రూ.1,381.02 కోట్లు, ఎల్‌టీ-5 కేటగిరీలో వ్యవసాయానికి రూ.9,124.82 కోట్ల సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. దీన్ని టీఎస్‌ఈఆర్‌సీ టారీఫ్‌ ఆర్డర్‌లో పరిగణలోకి తీసుకున్నది. ప్రస్తు ఆర్థిక సంవత్సరం 2022-23లో ప్రభుత్వ సబ్సిడీ రూ.18,221.17 కోట్లు ఇచ్చింది. దీనికంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.903.65 కోట్లు 11శాతం ఆర్థికంగా సబ్సిడీ ప్రకటించిందని కమీషన్‌ వెల్లడించింది.


ట్రూ ఆఫ్‌ భారం ప్రభుత్వానికే..
వివిధ పేర్లతో వినియోగదారుల నుంచి ట్రూ ఆఫ్‌ చార్జీలు చేసుకునేందుకు అనుమతించమని విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) టీఎస్‌ఈఆర్‌సీకి గతంలో దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించిన కమిషన్‌ ఆ చార్జీలను రూ.12,780.40 కోట్లకు ఖరారు చేసింది. ఈ మొత్తాన్ని ఐదేళ్లలో దశల వారీగా విద్యుత్‌ సంస్థలకు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఈఆర్‌సీకి లేఖ రాసింది. దీంతో ఈ భారం నేరుగా విద్యుత్‌ వినియోగదారులపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఎన్నికల సంవత్సరం కావడంతో కరెంట్‌ చార్జీలు పెరగకుండా జాగ్రత్త పడింది. 2016-17 నుంచి 2022-23 వరకు మొత్తం ఏడేళ్ల విద్యుత్‌ కొనుగోలు ట్రూ ఆఫ్‌ చార్జీలు రూ.12,514.57 కోట్లకు కమిషన్‌ ఆదేశం తెలిపింది. అలాగే 2006-7 నుంచి 2018- 19 వరకు విద్యుత్‌ పంపిణీ వ్యాపారం విల్లింగ్‌ చార్జీల ట్రూ ఆఫ్‌ పేరుతో డిస్కంలు రూ.4,578.41 కోట్లను క్లెయిం చేశాయి. దీనిలో కూడా ఉదయ్‌ స్కీం ద్వారా లభించిన ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని రూ.203.83 కోట్లకు ఈ సొమ్మును ఐదేళ్లలో డిస్కంలకు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌కు లేఖ రాయడంతో దీన్ని పరిగణలోకి తీసుకుని వినియోగదారులపై ఎటువంటి ఆర్థిక భారాలు వేయలేదని కమిషన్‌ చైర్మన్‌ శ్రీరంగారావు వివరిచారు. ఈ వేసవిలో 18 వేల మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా.. సరఫరా చేస్తామని విద్యుత్‌ సంస్థలు చెప్పడం మంచిదేనని, కానీ వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. విద్యుత్‌ సంస్థలు కూడా బిల్లింగ్‌ తక్కువగా చేసిన చోట పూర్తి స్థాయిలో చార్జీలు వసూలు చేసుకోవాలని, ప్రభుత్వంపైన మాత్రం భారం పడకుండా చూడాలని సూచించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పాత చార్జీలే వసూలు..
2023-24 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్‌ చార్జీలను ప్రస్తుత టారీఫ్‌నే వసూలు చేయనున్నారు. గృహ వినియోగానికి మొదటి 50 యూనిట్లకు ఒక్కో యూనిట్‌ ధర రూ.1.95 పైసలు చార్జీలు వసూలు చేస్తారు. 51వ యూనిట్‌ నుంచి 100 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌ ధర రూ.3.10 పైసలు వసూలు చేసుకునేందుకు వీలుగా ఈఆర్సీ డిస్కంలకు అనుమతి ఇచ్చింది. 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల విద్యుత్‌ వినియోగించే వినియోగదారులకు మొదటి 100 యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.3.40 పైసులు వసూలు చేసుకోవచ్చు. 101 యూనిట్‌ నుంచి 200 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌ ధర రూ.4.80 పైసల చొప్పు చార్జీలు వసూలు చేసుకోవచ్చు. 200 యూనిట్లకు పైగా వాడుకునే వినియోగదారులకు మొదటి 200 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.5.10 పైసలు వసూలు చేస్తారు. 200 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌ ధర రూ.7.70 పైసలు, అలాగే 300 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు యూనిట్‌ ధర రూ.9లుగా నిర్ణయించారు. 401 నుంచి 800 యూనిట్ల వరకు రూ.9.50 పైసలు, అలాగే 800 యూనిట్లకు పైగా వినియోగించుకునే వినియోగదారుల నుంచి యూనిట్‌కు రూ.10 వసూలు చేసుకునేలా ఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement