Thursday, March 28, 2024

రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే – అధికార పార్టీకి షాక్

ప్ర‌కృతి అందాల‌కి నెల‌వుగా నెల‌కొంది విశాఖ‌ప‌ట్నం..ప‌లు బీచ్ ల పేరుతో ప‌ర్యాట‌క ప్రేమికుల‌ని ఆక‌ర్షిస్తుంటుంది. విశాఖ‌లో ఎన్నో బీచ్ లు ఉన్నాయి. వాటిల్లో ఒక‌టి రుషికొండ‌. కాగా రుషి కొండ వ‌ద్ద పర్యాటక ప్రాజెక్టుల పేరిట భారీ ఎత్తున తవ్వకాలకు తెర తీశారు. అయితే ఆ తవ్వకాలకు సడెన్ గా బ్రేక్ పడిపోయింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఈ తవ్వకాల మీద స్టే విధించింది. దాంతో ఒక విధంగా ఇది అధికార పార్టీ ప్రయత్నాలకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. నిజానికి రుషికొండ వద్ద తవ్వకాలు అన్నీ పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని ..టీడీపీ.. జనసేన రెండూ కూడా ఇప్పటికే అన్ని రకాలుగా పోరాటాలు చేపడుతూ వచ్చాయి. ఈ మధ్య టీడీపీ అధినేత‌ చంద్రబాబు విశాఖ వచ్చినపుడు రుషికొండ తవ్వకాలను పరిశీలించాలనుకున్నారు. దానికి పోలీసులు అడ్డుచెప్పడంతో బాబు ఆగ్రహించారు. కొండని పిండి చేసి పెద్దలు మింగాలని చూస్తున్నారు. నిజంగా అక్కడ టూరిజం ప్రాజెక్టులే కడుతూంటే ఎందుకు చూపించరని మండిపడ్డారు. మేం కనుక అధికారంలోకి వస్తే కొండని పిండి చేసి మింగేసిన వారి నుంచి అంతకు అంతా కక్కించి తీరుతామని కూడా స్పష్టం చేశారు. ఇక విశాఖ తీర ప్రాంతంలో ఉన్న కొండలే కొండంత రక్షణ. 2014లో హుదూద్ తుఫాన్ విశాఖను ఉఫ్ అని ఊదేయకుండా కాపాడిన ఘనత కూడా ఈ కొండలదే. అలాంటి కొండల వద్ద ఎలాంటి పర్యావరణ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు ఉన్నాయి. అయితే వాటిని కాలదన్ని ఇష్టం వచ్చినట్లుగా కొండను తవ్విపడేస్తున్నారు అని టీడీపీ నేతలు గట్టిగానే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే విధించింది. అంతే కాదు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపరాదని ఆదేశించింది. ఇక ఈ అంశం మీద వైసీపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఎన్జీటీ ఇప్పటివరకు జరిగిన తవ్వకాలపై పూర్తి స్థాయి అధ్యయనానికి సంయుక్త కమిటీని నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement