Thursday, April 25, 2024

8 నెలల చిన్నారిపై పనిమనిషి దాడి.. మంచం కోడుకు బాదడంతో..

గుజరాత్‌ రాష్ట్రం సూరత్ జిల్లాలో దారుణం జరిగింది. 8 నెలల పసికందును కేర్‌టేకర్ నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి కారణంగా బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతున్న చిన్నారి ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ కుటుంబం సూరత్‌లోని రాందర్ పాలన్‌పూర్ పాటియాలో నివసిస్తోంది. పిల్లల తల్లిదండ్రులు ఇద్దరూ జాబ్ చేస్తున్నారు. అయితే వారి పిల్లలను చూసుకోవడానికి ఒక కేర్‌టేకర్‌ను నియమించుకున్నారు.

ఇంట్లో వారు లేకపోవడంతో తమ పిల్లలు ఏడుస్తున్నారని ఇరుగుపొరుగు వారు చెప్పడంతో ఆ దంపతులు తమ ఇంట్లో సీసీ కెమెరా పెట్టారు. కాగా, కేర్‌టేకర్ చిన్నారిని కిరాతకంగా కొట్టిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. వీడియోలో ఆమె పదేపదే పిల్లల తలను మంచంపై కొట్టడం కినిపిస్తోంది. ఆమె చిన్నారి జుట్టు పట్టుకుని మెలి తిప్పడం,  కనికరం లేకుండా కొట్టడం కూడా కనిపిస్తోంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.

నిందితురాలు కోమల్ చంద్లేకర్‌ను మూడు నెలల క్రితమే పనిలోకి తీసుకున్నారని చిన్నారి అమ్మమ్మ కలాబెన్ పటేల్ చెప్పింది. కోమల్ మొదట్లో పిల్లలను బాగా చూసుకునేదని, ఆమె సంరక్షణలో పిల్లలు ఏడుస్తూనే ఉండడంతో అనుమానం వచ్చినట్టు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సీసీటీవీ కెమెరాను అమర్చడంతో దారుణం వెలుగులోకి వచ్చినట్టు తెలియజేసింది. చిన్నారి తండ్రి మితేష్ పటేల్ సూరత్‌లోని రాందర్ పోలీస్ స్టేషన్‌లో నిందితురాలిపై హత్యాయత్నం కేసు పెట్టారు. కాగా, నిందితురాలికి పెళ్లయి 5 ఏళ్లు అవుతోందని, ఆమెకు సొంత బిడ్డ లేదని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement