Saturday, April 20, 2024

Cricket | గెలిచి తీరాలి, ఆఖరి టెస్టు టీమిండియాకు సవాల్‌.. అహ్మదాబాద్‌ వేదికగా నాలుగో మ్యాచ్‌

బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీలో చివరి టెస్టుకు భారత్‌, ఆస్ట్రేలియా జట్లు సిద్ధమయ్యాయి. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్‌కు ఈ మ్యాచ్‌ కీలకం. ఇందులో గెలిస్తే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు నేరుగా అర్హత లభిస్తుంది. నాగ్‌పూర్‌, న్యూఢిల్లిలో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో భారత్‌ గెలిచింది. పర్యాటక జట్టుపై సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. అయితే ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో ఘోరంగా ఓడింది. దీంతో టీమిండియా బలహీనతలు బయటపడినట్లు అయింది.

రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా టాప్‌ ఆర్డర్‌ తమ ప్రత్యర్ధుల కంటే మెరుగ్గా రాణిస్తోంది. ఇండోర్‌లో ఉస్మాన్‌ ఖవాజా తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేయడం రెండు జట్ల మధ్య తేడాగా చెప్పవచ్చు. మార్నస్‌ లాబుస్చాగ్నే, స్టీవ్‌ స్మిత్‌, పీటర్‌ హ్యాండ్‌కాంబ్‌, కామెరాన్‌ గ్రీన్‌ అందరూ ముఖ్యమైన స#హకారాన్ని అందించారు. టెయిలెండర్లు కూడా రాణించడం ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను గణనీయంగా బలోపేతం చేసింది. ట్రావిస్‌ ##హడ్‌, లాబుస్‌చాగ్నే తర్వాత సెకండ్‌లో నెర్వ్‌లెస్‌ డిస్‌ప్లేతో గేమ్‌ను తమవైపు తిప్పుకున్నారు.

ఇండోర్‌లో ఆస్ట్రేలియా పుంజుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో కాస్తంత తడబడినప్పటికీ, నాథన్‌ లైయాన్‌ అత్యుత్తమ బౌలింగ్‌ ద్వారా మ్యాచ్‌ను గెలిచారు. జట్టులో ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేశారు. లైయాన్‌, టాడ్‌ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్‌ల తిరుగులేని కచ్చితత్వం భారత బ్యాటర్లకు చెక్‌ పెట్టాయి. స్వదేశీ జట్టుకు స్పిన్నింగ్‌ పిచ్‌లు శరాఘాతం అయ్యాయి. మొదటి రెండు టెస్టుల్లో బ్యాటింగ్‌లో రాణించిన రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌లు మూడవ టెస్టులో విఫలం అయ్యారు. దాంతో అర్థసెంచరీలు సాధించిన ఆటగాళ్లుగా రోహిత్‌ శర్మ, పుజారా మాత్రమే మిగిలారు.

ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో స్పిన్‌ కీలకంగా మారినందున, ఈసారి కూడా టాప్‌ ప్రధాన పాత్ర పోషించనుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఇరుదేశాల ప్రధానులు వస్తున్నందున రెండు జట్లు గెలుపు కోసం శ్రమిస్తాయనడంలో సందేహం లేదు. ఆస్ట్రేలియా కంటే కూడా భారత్‌కే గెలుపు చాలా అవసరం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాలి. అలాగే స్వదేశంలో ప్రధాని సమక్షంలో చారిత్రక విజయం సాధించాలన్న తపన కూడా టీమిండియా ఆటగాళ్లలో ఉంటుంది.

- Advertisement -

బౌలింగ్‌, బ్యాటింగ్‌లో చెమటోడ్చాలిందే..:ద్రవిడ్‌
సిరీస్‌లో చివరి టెస్టు గురించి భారత కోచ్‌ ద్రవిడ్‌ మాట్లాడుతూ, ‘మేము బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలోనూ శ్రమించాల్సి ఉంది. ఇండోర్‌ టెస్ట్‌, మొదటి ఇన్నింగ్స్‌లో 109 పరుగులు సరిపోలేదు. మేము 60-70 పరుగులు ఎక్కువ చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదన్నారు. సవాళ్లతో కూడిన వికెట్లపై ఆటగాళ్ల ప్రదర్శనలను కోచ్‌గా ఎలా నిర్ణయిస్తారని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, అలాంటి వికెట్లపై మంచి ప్రదర్శన ఏమిటనే దానిపై వాస్తవికంగా ఉండాలన్నారు.

స్పిన్‌ వ్యూహాల్లో భారత్‌కు ఎదురుదెబ్బే: పాంటింగ్‌

ఇండోర్‌ పిచ్‌ కోలాహలం తర్వాత, చివరి టెస్ట్‌ కోసం అహ్మదాబాద్‌లో ఏ పిచ్‌ సిద్ధం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే మూడవ టెస్టు ఓటమి తర్వాత భారత్‌ ఒత్తిడిలోకి వెళ్లిందని ఆస్ట్రేలియా లెజెండ్‌ రికీ పాంటింగ్‌ వ్యాఖ్యానించారు. స్పిన్‌ పిచ్‌లపై నుంచి దృష్టి మరల్చండి.. స్పిన్‌ వ్యూహాలు మీకు బెడిసికొట్టాయి అంటూ కోచ్‌, కెప్టెన్‌లకు సందేశమిచ్చాడు. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు వెళ్లడం కంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం గురించి ఆలోచన చేస్తే బాగుంటుందని పాంటింగ్‌ సలహా ఇచ్చాడు.

నంబర్‌ 1లో అశ్విన్‌, అండర్సన్‌

ఐసీసీ టెస్ట్‌ బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లండ్‌ సీమ్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గత వారం రోజులుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న అశ్విన్‌.. ఇప్పుడు అండర్సన్‌తో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్‌లో నాలుగు వికెట్లు మాత్రమే తీసిన అశ్విన్‌ ఆరు ర్యాంకింగ్‌ పాయింట్లు కోల్పోయాడు. దాంతో అశ్విన్‌, అండర్సన్‌ ఇద్దరూ 859 ర్యాంకింగ్‌ పాయింట్లతో సంయుక్తంగా మొదటి ర్యాంకులో నిలిచారు. గత కొంతకాలంగా ఐసీసీ టెస్ట్‌ బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌, అండర్సన్‌, ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ మధ్య పోటీ కొనసాగుతున్నది. భారత్‌తో రెండు, మూడో టెస్టులు ఆడకపోవడంతో వెనుకబడిన కమ్మిన్స్‌ ప్రస్తుతం 849 ర్యాంకింగ్‌ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. తాజా జాబితాలో సౌతాఫ్రికా బౌలర్‌ కాగీసో రబడా 807 ర్యాంకింగ్‌ పాయింట్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌లో విజృంభిస్తున్న ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ 9వ స్థానంలో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement