Friday, March 29, 2024

ఉపాధి బిల్లుల విషయంలో కేంద్రానికి లేఖ రాసిన రఘురామ

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఒకవైపు రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి లాబీయింగ్ చేస్తుంటే.. మరోవైపు జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని రఘురామ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఉపాధి హామీ నిధుల విషయంలో కేంద్రం, జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను జగన్ ప్రభుత్వం చెల్లించకుండా తాత్సారం చేస్తుండటంపై టీడీపీ కోర్టుకు కూడా వెళ్లింది. హైకోర్టు సైతం ఉపాధి బిల్లులను వెంటనే చెల్లించాలని జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా సరే ప్రభుత్వం మాత్రం బిల్లులని చెల్లించలేదు.

ఈ అంశంపై టీడీపీ పోరాటానికి ఎంపీ రఘురామ మద్ధతు ఇస్తున్నారు. ఈ మేరకు ఉపాధి హామీ పనులకు మీరిస్తున్న నిధులను జగన్ ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌కు రఘురామ లేఖ రాశారు. ఆ నిధులు వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రమంత్రిని కోరారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లేఖ రాసింది. రఘురామ లేఖపై సమగ్ర వివరణ పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో జగన్ ప్రభుత్వం ఇరుకున పడ్డట్లు అయింది. ఏపీ ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వకపోతే ఉపాధి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యేలా కనిపిస్తోంది.

ఈ వార్త కూడా చదవండి: సీఎం జగన్ ఇంటి ముట్టడికి యత్నించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

Advertisement

తాజా వార్తలు

Advertisement