Saturday, April 20, 2024

హుజూరాబాద్ లో యుద్ధానికి ముందే చేతులెత్తేస్తామా?: కాంగ్రెస్ తీరుపై కోమటిరెడ్డి అసమ్మతి రాగం

తెలంగాణ కాంగ్రెస్ తీరుపై అసంపూర్తిగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తన అసంతృప్తి గళాన్ని వినిపించారు. కొత్త పీసీసీ వచ్చి మూడున్నర నెలలు అయినా, ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు సమీక్ష చేయట్లేదని ప్రశ్నించారు.పీసీసీ నేతలు హుజూరాబాద్ ఎందుకు వెళ్లడంలేదని నిలదీశారు. పార్టీలో అసలేం జరుగుతోందో అర్థంకావడంలేదని అన్నారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు భారీగానే ఓటు బ్యాంకు ఉందని, గత మూడు ఎన్నికల్లో 60 వేల వరకు ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. అందరం కలిసి పనిచేస్తే మరో 50 వేల ఓట్లు రావా? అని అడిగారు. సీనియర్లను ఇన్చార్జిలుగా నియమించి, వారానికి ఒక్కసారి సమావేశం ఏర్పాటు చేస్తే పార్టీ గెలవదా? అని పేర్కొన్నారు.

జీరోగా ఉన్న దుబ్బాకలో 23 వేల ఓట్లు తెచ్చుకున్నామని, కానీ హుజూరాబాద్ పోరును కాంగ్రెస్ వదిలేస్తే దానర్థం ఏంటి? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. హుజూరాబాద్ లో యుద్ధానికి ముందే చేతులెత్తేస్తామా? ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయి? అంటూ అసహనం ప్రదర్శించారు. ఇలాంటివన్నీ భరించలేకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తుంటే పార్టీ సన్నద్ధమయ్యేది ఇలాగేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్లను సంప్రదించకుండా అధికార ప్రతినిధులను నియమిస్తారా? వచ్చేవారం రాహుల్ గాంధీ, ప్రియాంకలకు ఈ విషయాలు వివరిస్తానని వెల్లడించారు. ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాలి, అప్పుడే గెలుస్తుందని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు

Advertisement

తాజా వార్తలు

Advertisement