Saturday, April 20, 2024

Train Accident: ఒడిశా ప్రమాద స్థలానికి కాసేపట్లో మోడీ..

ఒడిశా బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 300మందికి పైగా దుర్మరణం చెందారు. మరో వెయ్యి మందికి పైగా తీవ్రగాయాలతో ఒడిశాలోని వివిధ హాస్పిటళ్లలోో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో నేటి ఉదయం ప్రధాని మోడీ ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాద వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు.

అలాగే అక్కడ జరుగుతున్న సహాయ రక్షణ కార్యక్రమాల వివరాలను ప్రమాద స్థలంలో రైల్వే మంత్రితో ఫోన్ లో సంభాషించి వివరాలు సేకరించారు. ఆ తర్వాత తాను కూడా ప్రమాద స్థలానికి వస్తున్నట్లు ప్రకటించారు. మరికాసేపట్లో ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్ లో బాలాసోర్ కు పయనమవనున్నారు. అక్కడ సహాయ రక్షణ కార్యక్రమాలను పరిశీలించనున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరికి రూ.2లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేలు ప్రధాని సహాయ నిధి నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు రైల్వే శాఖ ఒక్కొక్క మృతుని కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement