– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలో మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో జైల్లో ఉన్న లింగాయత్ ధర్మకర్త, మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావుపై పోలీసులు ఉచ్చు బిగించారు. బాధితుల వాంగ్మూలం, చార్జిషీట్లో పేర్కొన్న ఆధారాల ప్రకారం.. మఠంలోని హాస్టల్లో ఉండే మైనర్ బాలికలకు మత్తుమందు ఇచ్చి, లింగాయత్ మఠాధిపతి బూతులు తిట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించారు. కేసు మరింత పటిష్టం కావాలంటే.. బాధితులు ముందుకు వచ్చి మఠాధిపతిపై నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని దర్యాప్తు అధికారులు కోరారు.
మురుగ మఠం ఆవరణలోని బాలికల వసతి గృహంలో నివసిస్తున్న ఇద్దరు మైనర్ బాలికలపై శివమూర్తి శరణారావు మూడేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. శరణారావు పెడుతున్న బాధలు తట్టుకోలేక మఠం నుండి ఇద్దరు ఇద్దరు మైనర్ బాలికలు పారిపోయారు. వారు ఆగస్టు 26న మైసూరులోని ఓడనాడి అనే ఎన్జీవోని ఆశ్రయించారు. ఈ క్రమంలో బాలల సంక్షేమ కమిటీ సహాయంతో మైసూరు పోలీస్ స్టేషన్లో లింగాయత్ మఠాధిపతి శరణారావుపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఈ కేసులో హాస్టల్ వార్డెన్ రష్మీతో పాటు మరో నిందితుడు పరమశివయ్యపై కూడా పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
అయితే.. అప్పట్లో పలుకుబడితో ఈ కేసును తప్పుదారి పట్టించాలన్న యత్నాలు సాగాయి. కాగా, కేసును చిత్రదుర్గ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినప్పటికీ దాదాపు ఐదు రోజుల తర్వాత సెప్టెంబర్ 1న నిందితుడిని అరెస్టు చేశారు. ఇక.. బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకు అనేక మంది పెద్ద పెద్ద లీడర్లు లింగాయత్ మఠాధిపతికి సపోర్ట్గా నిలిచారు. ఎందుకంటే ఇది వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున లింగాయత్ ఓటు బ్యాంక్ని కాపాడుకునే యత్నంలో భాగంగానే, మఠాధిపతి నిందితుడు అన్న విషయాన్ని ఒప్పుకుంటే ఆ సామాజిక వర్గం దూరం అవుతుందన్న కారణంగా ఎవరూ రిస్క్ చేయలేకపోయినట్టు తెలుస్తోంది.