Friday, March 29, 2024

రియల్టర్ కు మంత్రి మల్లారెడ్డి బెదిరింపులు!

మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని ఓ వెంచర్ విషయంలో వాటా కావాలంటూ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు సంబంధించిన ఆడియో టేపు సంచలనం రేపుతోంది. వాటా కావాలంటూ మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్న ఆడియో టేపు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్ నగర శివారు శామీర్‌పేట మండలం బొమ్మరాజుపేటలో 67 ఎకరాల్లో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ పడింది. దాంట్లో వాటా ఇవ్వాల్సిందే అంటూ మంత్రి మాట్లాడినట్టు ఆడియో టేపు మీడియాలో వైరల్‌గా అవుతోంది. వాటా ఇచ్చే వరకు వెంచర్‌ను ఆపాల్సిందే అంటూ మంత్రి హుకూం జారీ చేసినట్టు ఆడియోలో వినిపిస్తోంది. సర్పంచ్‌లకు వాటాలు ఇస్తే.. ఎమ్మెల్యే, మంత్రులకు ఇవ్వారా అంటూ డిమాండ్ చేయడం కూడా వినిపిస్తోంది. ‘కలెక్టర్‌కు చెప్పి పొట్టు పొట్టు చేయిస్తాం.. ఏమైనా బిచ్చమెత్తుకోవాల్నా.. వాటా ఇచ్చే వరకు వెంచర్‌ను ఆపేయండి’ అంటూ హుకుం జారీ చేస్తున్న మాటలు ఆడియోలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆడియో టేపు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదిఇలా ఉంటే.. ఈ ఆడియో టేపులతో తనకు సంబంధం లేదని మంత్రి మల్లారెడ్డి అంటున్నారు. ఆడియో టేపులో ఉన్న వాయిస్ తనది కాదని, ఎవరో మిమిక్రీ చేశారని చెప్పారు. మిమిక్రీ చేసేవాళ్లు ఎక్కువైయ్యారని తెలిపారు. తాను ఎవరినీ బెదిరించాల్సిన అవసరం లేదన్నారు. వాయిస్ రికార్డుపై దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. తనకే వందల ఎకరాలు ఉన్నాయని, వేరే వాళ్ల భూమి తనకు అవసరం లేదని మంత్రి మల్లారెడ్డి అంటున్నారు.

మరోవైపు, గతేడాది కూడా మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైన సంగతి తెలిసిందే. మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్‌ మండలం సురారంలో తన భూమిని కబ్జా చేయించారని శ్యామలదేవి అనే మహిళ మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రి అనుచరులు తన స్థలంలో ప్రహరీగోడ నిర్మించారని, తన లాయర్‌ కూడా మంత్రితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వారు తప్పుడు అగ్రిమెంట్‌ను సృష్టించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంత్రి మాత్రం అప్పుడు ఈ వాదనను ఖండించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement