Friday, April 19, 2024

Paddy Procurement: కేంద్ర ప్రభుత్వంపై టిఆర్ఎస్ సమరభేరీ

ఆహార భద్రత చట్టం ప్రకారం దేశంలో పండిన ప్రతీ వరి గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేసేదాక మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం వైఖరి తెలిసే వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్‌ ముందే రైతులకు సూచించారన్నారు. వరి వేయాలని బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు. వరి కొనిపిస్తామన్న బీజేపీ నేతలు.. ఇప్పుడు కనిపించడం లేదని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్ లను నియంత్రించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్న మంత్రి.. రాష్ట్రాలలో పండిన పంటలను ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు తరలించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాల వల్ల దేశంలో ఆకలి కేకల సూచీ అద్వాన్నంగా క్రింది స్థాయి కి పడిపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వల్లే సోమాలియా తరహా ఆకలి కేకలు దేశంలో తప్పినాయన్నారు. ఓ వైపు బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా, పార్టీగా రైతులకు వరి విషయంలో తాము చెప్పే ప్రయత్నం చేస్తే, వరి వేయాలని ధాన్యం కొంటా మని, దుష్ట రాజకీయాలకు బిజెపి పాల్పడిందని మంత్రి మండిపడ్డారు. మోసపూరితంగా కేంద్రంలో ఒకలా రాష్ట్రంలో ఒకలా ప్రవర్తిస్తున్న బిజెపి దుర్మార్గపు రాజకీయాలకు చరమగీతం పాడాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement