Monday, April 15, 2024

కేసీఆర్ పై విషం చిమ్మేందుకే బీజేపీ సభ: అమిత్ షాకు మంత్రి జగదీష్ కౌంటర్

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. అమిత్ షా అంటే అమితమైన అబద్దాలు చెప్పే షా అని నిన్నటి మీటింగ్ తో నిరూపించారని అన్నారు. భారత దేశంలో అత్యంత అబద్దాలు ఆడిన హోం మంత్రిగా అమిత్ షా రికార్డు సృష్టిస్తాడని ఎద్దేవా చేశారు. కెసిఆర్ పైన విషం చిమ్మడం తప్ప నిన్నటి మీటింగ్ లో విషయమేదీ లేదన్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ అధికార మార్పిడి కాదు,ఢిల్లీ గద్దె నుండి బీజేపీ దిగిపోవడం ఖాయం అయ్యిందన్నారు. కేంద్రం లక్షల కోట్ల అప్పులు చేయవచ్చు కానీ రాష్ట్రాలు అబివృద్ది కోసం అప్పులు చేయకుండా కేంద్రం కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న చీకట్లు తెలంగాణలో కూడా ఉండాలని బీజేపీ కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణలో అధికార మార్పిడి కాదు, జాతీయ స్థాయిలో కెసిఆర్ వల్ల ముప్పు ఉన్నదనే బీజేపీ నాయకులు భయంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ,కాంగ్రెస్ లు కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రహస్య ఒప్పందాన్ని త్వరలో బయట పెడతామన్నారు.

ఏడిస్తే ప్రజలు అధికారం ఇవ్వరని,ప్రజల కోసం పని చేసే వాళ్ళకి అధికారం ఇస్తారని బండి సంజయ్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొంగ జపం,దొంగ జపం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. కెసిఆర్ ను వదులుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. డబల్ ఇంజిన్ వల్ల ప్రజలను దోచుకోవడం తప్ప బీజేపీ నాయకులు చేసిందేమీ లేదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement