Wednesday, April 24, 2024

మార్చి నుంచి దళిత బంధు.. లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు

ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే విధంగా నియోజకవర్గానికి 100 కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని మొదటి విడతగా అమలు చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ కలెక్టర్ కార్యాలయంలో జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి దళిత బంధు కార్యక్రమ రూపకల్పన, అమలుపై సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత బంధు పథకం దేశంలోనే విశిష్టమైన, అరుదైన పథకం అన్నారు. సీఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన అనేక నూతన పథకాల్లో దళిత బంధు వినూత్న పథకంగా మంత్రి చెప్పారు. నియోజకవర్గంలో 100 మందికి, రూ.10 లక్షల చొప్పున, బ్యాంక్ లింకేజ్ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ అయ్యే విధంగా సీఎం రూపకల్పన చేశారని చెప్పారు.

లబ్ధిదారులు తమ జీవనోపాధికి ఉపయోగపడే ఆర్థిక ఉపాధి కార్యక్రమాలను రూపొందించుకోవాలని, తద్వారా వాళ్లంతా బాగుపడాలనేది సీఎం గారి ఆలోచన అన్నారు. జనగామ జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధు సమన్వయం చేయడానికి అధికారులను నియమించామని చెప్పారు. జనగామ కు ఆర్డీవో మధు మోహన్, స్టేషన్ ఘనపూర్ కు drdo రామ్ రెడ్డి, పాలకుర్తి కి dpo రంగా చారీ ఇంచార్జీ లుగా ఉంటారని తెలిపారు.
అలాగే స్టేషన్ జనగామ నియోజకవర్గంలో 24,209 దళిత ఇండ్లు ఉండగా, 84,530 జనాభా ఉందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 19,093 ఇండ్లు ఉండగా, 67,825 జనాభా ఉందని, జనగామ నియోజకవర్గంలో 17,516 ఇండ్లు ఉండగా, 62,260 జనాభా ఉందని వివరించారు. ఈ మూడు నియోజక వర్గాల్లో 60,818 ఇండ్లు ఉండగా, 2,14,615 మంది దళిత జనాభా ఉందని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో ప్రజలంతా సమాన అవకాశాలు ఉండాలని, ఆర్థికంగా అంతా ఎదగాలని, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని సీఎం కెసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో వేసే కమిటీల అధ్వర్యంలో సీఎం గారి ఆశయాలకు అనుగుణంగా అంతా కలిసి కట్టుగా సమన్వయంతో పని చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు ఆదేశాలిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement