Thursday, March 28, 2024

మమతా బెనర్జీ ఓటమి.. ?

నందిగ్రామ్ లో మమతా బెనర్జీ గెలుపుపై సందిగ్ధత నెలకొంది. నందిగ్రామ్ బరిలో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ తరఫున సువేందు అధికారి పోటీ పడ్డారు. అయితే, సువేందుపై మమతా 1200 ఓట్ల మెజారిటీతో నెగ్గినట్టు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, మమతా బెనర్జీ తాజా వ్యాఖ్యలతో నందిగ్రామ్ ఫలితంపై అనిశ్చితి ఏర్పడింది.

నందిగ్రామ్ ఫలితం గురించి బాధపడకండి. ఇదేమంత పెద్ద విషయం కాదు. నందిగ్రామ్ కోసం ఎంతో పోరాటం చేశాను. నందిగ్రామ్ ప్రజలు వాళ్లు ఇవ్వాలనుకున్న తీర్పును ఇచ్చేశారు. దాన్ని నేను అంగీకరిస్తున్నాను. దాని గురించి నేనేమీ పట్టించుకోవడంలేదు. 221 కంటే ఎక్కువ సీట్లను గెలుస్తున్నాం. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది” అని వ్యాఖ్యానించారు. అటు, నందిగ్రామ్ ఫలితం ప్రకటించవద్దని తృణమూల్ వర్గాలు ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలుస్తోంది. తృణమూల్ విజ్ఞప్తిని ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఇక పశ్చిమ బెంగాల్ లో వరుసగా మూడోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 200కి పైగా స్థానాలు దక్కనుండడంతో ఆ పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో నీచ రాజకీయాలకు పాల్పడిన బీజేపీ ఓటమిపాలైందని అన్నారు. ఎన్నికల సంఘం రూపంలో తమకు భయానక అనుభవాలు ఎదురయ్యాయని, అన్నింటికి ఎదురొడ్డి నిలిచామని మమత అన్నారు.  

ఇది ప్రజలు అందించిన ఘనవిజయం అని, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పారు. ఇక తాను వెంటనే కొవిడ్ కట్టడి చర్యల్లో నిమగ్నమవుతాయని మమత వెల్లడించారు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాణస్వీకారం కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా, మీడియా సమావేశం ఆరంభంలో ఆమె జై బంగ్లా అంటూ గట్టిగా నినదించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విజయోత్సవ ర్యాలీలు, వేడుకలు జరుపుకోవద్దని టీఎంసీ శ్రేణులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement