Thursday, April 25, 2024

Big Story: జనరల్​ బిపిన్ రావత్ ఆర్మీ జీవితం.. ఎన్నో పోరాటాలు, మరెన్నో అవార్డులు..

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీసీ బిపిన్​ రావత్​తో పాటు 13 మంది చనిపోయారు. అందులో బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ కూడా ఉన్నారు. బిపిన్ రావత్ రక్షణ రంగంలో దేశానికి ఎనలేని సేవలు అందించారు. మొదటి త్రివిధ దళాల అధిపతిగా రావత్​ ఉన్నారు..

త్రివిధ దళాలకు అధిపతిగా ఒక వ్యక్తిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన వచ్చిన తర్వాత.. దాదాపు అందరు నాయకులకు ముందుగా తట్టిన పేరు బిపిన్ రావత్. 2019 డిసెంబర్ 31న రావత్ త్రివిధ దళాలకు చీఫ్​గా బాధ్యతలు స్వీకరించారు. డిఫెన్స్‌కు కూడా ఆయననే చీఫ్‌గా వ్యవహరించారు. మామూలుగా ఆర్మీ అధికారుల రిటైర్‌మెంట్ వయసు 62 సంవత్సరాలుగా ఉండేది. కానీ, బిపిన్ రావత్‌ను సీడీఎస్ చీఫ్‌గా నియమించడం కోసం దీన్నీ 65 ఏళ్లకు పెంచారు. ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా కూడా బిపిన్ రావత్ పనిచేశారు.

మిలిటరీలో బిపిన్ రావత్.. 2016 డిసెంబర్ 17న 27వ చీఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమితులయ్యారు. డిసెంబర్ 1978లో ఆర్మీలో చేరిన రావత్ తన తండ్రి పనిచేసిన 5వ బెటాలియన్‌లోనే సేవలు అందించారు. 42 ఏళ్ల పాటు ఆర్మీలో పనిచేసిన బిపిన్.. బ్రిగేడ్ కమాండర్‌గా, జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్, జనరల్ స్టాఫ్ ఆఫీసర్, కల్నల్ మిలిటరీ సెక్రటరీ, డిప్యూటీ మిలిటరీ సెక్రటరీ, సీనియర్ ఇన్‌స్ట్రక్టర్‌గా, ఆర్మీ స్టాఫ్‌కు వైస్ చీఫ్‌గా పనిచేశారు.

బోర్డర్‌లో పాకిస్థాన్ పన్నిన కుయుక్తులను బిపిన్ రావత్ సమర్థంగా తిప్పికొట్టారు. 2017లో చైనా, భూటాన్, ఇండియా బోర్డర్ వద్ద జరిగిన డొక్లాం సమస్య పరిష్కారంలో రావత్ కీలక పాత్ర పోషించారు. 2015లో జరిగిన మయన్మార్ స్ట్రైక్ సమయంలో కూడా బిపిన్ రావత్ ధృడంగా నిలబడి ఆర్మీని ముందుండి నడిపించారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో కూడా బిపిన్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు.

2019 ఫిబ్రవరిలో బాలాకోట్ దాడుల ఘటనపైనా చాలా ధైర్యంగా స్పందించారు. మిలిటరీ మీడియా స్ట్రాటజిక్ స్టడీస్‌లో చేసిన స్టడీకి ఆయనకు డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ కూడా దక్కింది. రెండుసార్లు ఆయన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా అవార్డులు అందుకున్నారు. యూఎన్‌లో సేవలు అందిస్తున్న సమయంలో ఫోర్స్ కమాండ్ కమెండేషన్‌లో రెండుసార్లు ఆయనకు అవార్డు అందింది. ఇలా బిపిన్ రావత్ 42 ఏళ్ల సర్వీసులో రక్షణ రంగంలో ఎంతో పేరు గడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement