Wednesday, April 24, 2024

నష్టాలతో మూసివేతకు నిర్ణయం..

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ సంచలన నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్‌ల వ్యాపారానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. భారీ నష్టాల కారణంగా స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తిని నిలిపివేస్తున్న‌ట్లు తెలిపింది. దాదాపు అరేళ్లుగా తీవ్ర నష్టాలతో కొట్టిమిట్టాడుతున్న ఎల్‌జీ తన ఫోన్ వ్యాపారాన్ని జర్మనీకి చెందిన వోక్స్ వాగన్ ఏజీ, వియత్నాం కంపెనీ విన్‌గ్రూప్ జెఎస్‌సీ సహా రెండు బడా కంపెనీలకు విక్రయించాలన్న ప్లాన్లు  విఫలం కావడంతో ఈ  దిశగా  కంపెనీ అడుగులు వేసింది. తద్వారా  మార్కెట్ నుండి పూర్తిగా వైదొలిగిన మొట్టమొదటి ప్రధాన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా ఎల్‌జీ నిలిచింది. ఎల్‌జీ కంపెనీ మొద‌ట‌ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలతో సహా అనేక సెల్ ఫోన్ ఆవిష్కరణలతో మార్కెట్‌లోకి దూసుకొచ్చింది.

2013లో ఆపిల్‌, శాంసంగ్‌ తరువాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా నిలిచింది. కానీ ఆ తర్వాత‌ తీవ్ర పోటీకి తోడు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ప్రమాదాల వివాదంలో పడింది. మరోవైపు చైనా ప్రత్యర్థులతో పోల్చితే ఎల్‌జీ కంపెనీకి మార్కెటింగ్ నైపుణ్యం కూడా అంత‌గా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, గత ఐదేండ్ల‌లో ఎల్‌జీ దాదాపు 4.5 బిలియన్ డాలర్ల మేర నష్టాలను చవిచూసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement