Tuesday, April 16, 2024

Followup: మతోన్మాద శక్తులనుంచి దేశాన్ని కాపాడుకుందాం.. విచ్చిన్నకర శక్తులతో ప్రమాదం: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మతోన్మాద శక్తులనుంచి ప్రశాంత తెలంగాణను కాపాడుకుందామని సీఎం కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతగానో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా తెలంగాణ అలరారుతున్నది. సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తున్నది. ఈ తరుణంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమ వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని ప్రజలను హెచ్చరించారు.

ఈ సందర్భంగా మతతత్వ శక్తుల కుట్రలపై మాట్లాడుతూ…దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయి. తమ సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నాయి. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదు. మతం చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే అది దేశం యొక్క, రాష్ట్రం యొక్క జీవికనే కబళిస్తుంది. మానవ సంబంధాలనే మంట గలుపుతుంది. జాతి జీవనాడిని కలుషితం చేస్తుంది.

జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్‌ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయి. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ అవకాశవాదులు, ఆషాడ భూతులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి అని ఆరోపించారు.

తెలంగాణది చురుకైన సమాజం… దుష్ట, భ్రష్ట శక్తుల కుటిలయత్నాలను తిప్పికొడుదాం..
అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నదని గతాన్ని గుర్తు చేశారు. అదే క్రియాశీలతను, బుద్ధి కుశలతను మరోమారు చూపించాలని పిలుపునిచ్చారు. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట, భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలని తెలంగాణ సమాజానికి హితవు పలికారు. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోమారు హెచ్చరిస్తున్నానని జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేదికగా మరోసారి పిలుపునిచ్చారు.

- Advertisement -

పెట్రేగుతున్న మతతత్వ శక్తులతో ప్రమాదం..
ఏ దేశమైనా, ఏ సమాజమైనా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, వాటిలోని మంచి చెడులను అర్ధం చేసుకుంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలి అని, రాష్ట్రంలో పెట్రేగిపోతున్న మతతత్వ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. శనివారం పబ్లిక్‌ గార్డెన్‌లో జరిగిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కొన్ని శక్తులు విద్వేషపు మంటలను రగిల్చి విషవ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిల్చే సెప్టెంబర్‌ 17 సందర్భాన్ని కూడా వక్రీకరించి, తమ సంకుచిత స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆదమరిస్తే అంతే… రెప్పపాటు ఏమరుపాటు కూడా వద్దు..
ఈ సందర్భంగా ఆయన పోలీసు గౌరవ వందనం స్వీకరించిన ఆయన అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ …ఏ కొంచెం ఆదమరిచినా ఎంతటి బాధాకరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మన తెలంగాణే మనకు ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమరుపాటు వల్ల తెలంగాణ 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితం అనుభవించింది. తాను కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఎంతోమంది జైలుపాలు కావలసి వచ్చింది, ఎన్నో జీవితాలు ఆ#హుతై పోవాల్సి వచ్చింది. ఆ చరిత్రంతా నేను వేరే చెప్పనక్కరలేదు. అది మనందరి ప్రత్యక్ష అనుభవం. సమీప చరిత్రలోనే జరిగిన తెలంగాణ ఉద్యమంలో మనమందరం ప్రత్యక్ష భాగస్వాములమే. హక్కుల కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అనుభవించిన ఘర్షణను తలచుకుంటే నేటికీ నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేలపై నెలకొన్న శాంతి, సౌభ్రాతృత్వాలను గుండెల నిండా శ్వాసించే వ్యక్తిగా.. మీ బిడ్డగా చెబుతున్నా..
అటువంటి కష్టం, అటువంటి వేదన పొరపాటున కూడా మళ్లిd రాకూడదని కోరుకున్నారు. అందుకు నిశిత పరిశీలన, నిరంతర చైతన్యం కావాలని ఆకాంక్షించారు. మీ అందరి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తిగా, అనునిత్యం తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా, ఈ నేల పై నెలకొన్న శాంతి, సౌభ్రాతృత్వాలను గుండెల నిండా శ్వాసించే వ్యక్తిగా.. ప్రతీ క్షణం ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తిగా, అన్నింటికి మించి మీ బిడ్డగా ఈ విషయం మీకు చెప్పడం నా కర్తవ్యం. నా గురుతర బాధ్యత.

మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే.. ఎన్నటికీ ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప, అశాంతి, అలజడులతో అట్టుడికి పోవద్దు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో.. అంతేవేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకు పోవాలి. జాతినిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలి. భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మనవంతు దోహదం చేద్దామని అందరినీ కోరుకుంటూ మరోమారు యావత్‌ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఓం సహనావవతు సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహ… తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహ, ఓం శాంతి శ్శాంతి శ్శాంతి: అంటూ స్లోకాన్ని చదివి వినిపించి లోక శాంతిని కాంక్షించారు. మనం పరస్పరం కాపాడుకుందాం.. లోకంలోని సంపదను సమంగా అనుభవిద్దాం.. మనం వీరులమై, పరాక్రమశీలురమై జీవిద్దాం.. మన తేజస్సుతో ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం.. మనం విద్వేషాలను విడనాడి, విశ్వశాంతిని సాధిద్దాం.. అంటూ రాష్ట్ర, దేశ ప్రజానీకానికి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement