తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్రవాహనాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఆరు అంబులెన్స్లను విరాళంగా ఇచ్చానన్న కేటీఆర్… టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు మొత్తంగా 90 అంబులెన్స్లను విరాళం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన తన జన్మదినం సందర్భంగా అవసరం ఉన్న వారికి వ్యక్తిగతంగా సాయం అందించాలని కోరారు. అదే రోజున నిర్వహిస్తోన్న ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని తెరాస నేతలు, అనుచరులు, అభిమానులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తన జన్మదినం రోజున బొకేలు, కేకులు, హోర్డింగుల కోసం వృథాగా డబ్బు ఖర్చు చేయవద్దని కేటీఆర్ సూచించారు.
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తాము కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని టీఆర్ఎస్ నేతలు ముందుకొచ్చారు. తాను కూడా 50 మంది దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు అందిస్తానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కూడా తన వంతుగా 20 ద్విచక్రవాహనాలను దివ్యాంగులకు అందిచనున్నట్లు తెలిపారు. కేటీఆర్ అడుగుజాడల్లోనే తాము కూడా పయనిస్తూ.. తన శక్తి మేరకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఇక ఎమ్మెల్సీ శింభీపూర్ రాజు కూడా 60 బైకులను ఉచితంగా అందిస్తానని చెప్పారు.
ఇది కూడా చదవండి: రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ను తాకిన వరదనీరు