Friday, April 19, 2024

Big Breaking: బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

రాష్ట్ర మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పై ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్ కి కేటీఆర్ నోటీసులు జారీచేశారు. ఈనెల 11వ తేదీన ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ పైన నిరాధారమైన బండి సంజయ్ నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డంతో.. బండి సంజయ్ చేసిన ఆరోపణలపైన ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాల‌ని కేటీఆర్ తెలిపారు. లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు ఈ రోజు కేటీఆర్ న్యాయవాది నోటీసులు జారీ చేశారు. మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార పూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో పేర్కొన్నారు.

ఒక జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా… కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లయింట్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని న్యాయవాది తెలిపారు. మంత్రి కేటీఆర్ పరువుకు న‌ష్టం కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని తన నోటీసులో కేటీఆర్ న్యాయ‌వాది పేర్కొన్నారు. 48 గంటల్లో తన క్ల‌యింట్ కేటీఆర్ కి బేషరతులు లేకుండా క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ న్యాయవాది తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement