Thursday, April 18, 2024

KTR: మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన కేటీఆర్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జిగా వ్యవహరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని కేటీఆర్ అభినందించారు. పాలకుర్తి నియోజకవర్గ పర్యటనలో భాగంగా తొర్రూరు మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో సమీక్ష సందర్భంగా కేటీఆర్ మంత్రి ఎర్రబెల్లికి ఫోన్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడం పట్ల అభినందించారు. అందరినీ సమన్వయం చేయడంలో మంత్రి ఎర్రబెల్లి మంచి కృషి చేశారన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారు.

అయితే, ఇదే సమయంలో తాను తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి సమీక్షలో ఉన్నానని మంత్రి ఎర్రబెల్లి చెప్పడంతో కేటీఆర్.. ఫోన్ లో స్పీకర్ ఆన్ చేసి, మైకు పెట్టి అందరికీ వినిపించేలా మాట్లాడారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, కమిషనర్, తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, పాలక వర్గం సభ్యులందరినీ అభినందించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు ఇస్తామని చెప్పారు. చైర్మన్, సభ్యులను తన వద్దకు తీసుకొని రావాల్సిందిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని మంత్రి కేటీఆర్ కోరారు. అందుకు మంత్రి త్వరలోనే వారిని కలిపిస్తామని చెప్పారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో మున్సిపాలిటీ పాలకవర్గం సంతోషం వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement