Saturday, April 20, 2024

ఫామ్ హౌస్ పాలన అవసరమా?: కిషన్ రెడ్డి

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈటల తరుపున కాషాయ నేతలు అంతా హుజురాబాద్ లోనే మకాం వేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం బుజునూరు గ్రామంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈటల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి, కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నిక హుజురాబాద్ అని ఆయన అన్నారు. ఏడేళ్ళుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని, కరోనా కారణంగా ప్రతి పేదింటికి ఉచితంగా బియ్యం ఇస్తున్నామన్నారు. ధర్మం వైపు ఉన్న ఈటల రాజేందర్ ను గెలిపించాలని కోరారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో హుజురాబాద్ లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ డబ్బులను నమ్ముకొని ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారన్నారు. మనకు ఫామ్ హౌస్ పాలన కావాలా…? సంక్షేమ పాలన కావాలా…? ఒకసారి ఆలోచించండి అని ప్రజలను కోరారు.

దళిత బంధు పై కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దళితులకు ఇస్తామన్న 3 ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. దళిత బంధు రావడానికి కారణం ఈటల రాజేందరే అని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి దళితునికి దళితబంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ప్రజలు చరమ గీతం పాడాలంటే హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ను గెలిపించాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా.. ఆ జిల్లాలో అత్యధిక కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement