Friday, April 26, 2024

ముస్తాబైన ఖైరతాబాద్ వినాయకుడు

వినాయ‌క చ‌వితి పండుగ‌ వ‌స్తుందంటే అంద‌రి మ‌దిలో ముందుగా మెదిలేది ఖైర‌తాబాద్ బొజ్జ వినాయ‌కుడే. గణేష్ చతుర్థి కోసం భాగ్యనగరం ముస్తాబవుతుంది. భారీ ఆకారంలో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ గణపతికి హైదరాబాద్‌లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. పండుగకు వారం రోజుల ముందే ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ పూర్తైంది. విగ్రహ తయారీలో చివరి ఘట్టమైన కళ్లు అద్దకాన్ని కళాకారులు పూర్తి చేశారు. ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వారం రోజుల ముందుగా ఖైరతాబాద్ గణేషుడు దర్శనం ఇస్తున్నారు. గత ఏడాది కరోనా కారణంగా కేవలం 11 అడుగుల ఎత్తుకే పరిమితమైన ఈ గణపయ్యను ఈసారి భక్తుల కోరిక మేరకు 40 అడుగుల ఎత్తుతో తయారు చేశారు.

ప్ర‌తి సంవ‌త్స‌రం 11 రోజుల పాటు ఖైరతాబాద్‌లో ఓ పుణ్యక్షేత్రంగా మారుతుంది. లక్షలాది మంది భక్తులు గణపతి దర్శనార్థం ఇక్కడకు వస్తుంటారు. ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు ఈ ఏడాది 12 తలలు, 24 చేతులు, ఆరు సర్పాలు, సప్తాశ్వాలతో కూడిన సూర్యరథంపై గణనాథుడు కొలువుకానున్నాడు. ఈ విగ్రహాన్ని 40 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడ‌ల్పుతో తీర్చిదిద్దారు. అలాగే వినాయ‌కుడి కుడి వైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి.. ఎడమ వైపున బ్రహ్మా, విష్ణు, మహేశ సమేత దుర్గాదేవి ఉండనున్నారు. ఒక్కో తలకు ఒక్కో రకమైన రంగుతో గ‌ణ‌నాథుడు రూపుదిద్దుకున్నాడు. ప్ర‌తి ఏడాది ఏదో ఒక ప్రత్యేకతను చాటే ఖైరతాబాద్ విఘ్నేషుడు ద్వాదశాదిత్య మహా గణపతిగా కొలువుదీరనున్నాడు. ఇక విగ్రహ తయారీ కోసం వివిధ రాష్ట్రాల నుంచి 150 మంది కళాకారులు మూడు నెల‌ల పాటు రాత్రుంబవళ్లు శ్రమించారు. ఈ మహా గణపతిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ రూపంలో వినాయకుణ్ని కొలిస్తే సకాలంలో వర్షాలు పడటంతోపాటు, తాము అనుకున్న కోరికలు నెరవేర‌తాయ‌ని అంద‌రూ భావిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement