Thursday, April 25, 2024

కర్ణాటకలో ఈ నెల 10 నుంచి సంపూర్ణ లాక్ డౌన్..

కొవిడ్ దెబ్బకు అతలాకుతలం అవుతోంది కర్ణాటక రాష్ట్రం. దీంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. కేవలం బెంగళూరు మహానగరంలోనే 23 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ కొవిడ్ వ్యాప్తి విశృంఖలంగా కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం యెడియూరప్ప వెల్లడించారు.

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యలో విపరీతమైన పెరుగుదల, అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తుండడంతో లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యెడియూరప్ప వివరణ ఇచ్చారు. అయితే, ఇది తాత్కాలిక లాక్ డౌన్ మాత్రమేనని, వలస కూలీలు తాము ఉపాధి పొందుతున్న ప్రాంతాలను విడిచి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటల తర్వాత ఒక్కరిని కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. అన్ని హోటళ్లు, పబ్ లు, బార్లు మూతవేయాలని అన్నారు. ఫలహార శాలలు, మాంసం దుకాణాలు, కూరగాయల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అనుమతిస్తారని వివరించారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు అధికారులను ఆదేశించారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement