దేశంలో కరోనా మహమ్మారి చెలరేగిపోతోంది. సెకండ్ వేవ్ లో రెట్టింపు వేగంతో విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు కర్ఫ్యూను అమలు చేస్తుండగా ఆ జాబితాలో కర్ణాటక చేరింది. కరోనా మహమ్మారికి కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒకేసారి రెండు విడుతల కర్ఫ్యూను అమలు చేయనుంది. నైట్, వీకెండ్ కర్ఫ్యూ అమలు చేయనుంది. సీఎం యడ్యూరప్ప వర్చువల్ విధానంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తిస్థాయి కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. బుధవారం నుంచి మే 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. కర్ణాటకలో స్కూళ్ళు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, సినిమా హాల్స్, మాల్స్, జిమ్, యోగా సెంటర్లు బంద్ కానున్నాయి.
ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్డౌన్ బాట పట్టాయి. మంగళవారం తెలంగాణ ప్రభుత్వం నైట్కర్ఫ్యూ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం వారాంతపు లాక్ డౌన్ కు ఆదేశాలిచ్చింది. అలాగే ఢిల్లీలో సైతం వారం రోజుల లాక్డౌన్ విధించగా.. జార్ఖండ్ ప్రభుత్వం సైతం వారం రోజుల లాక్ డౌన్ ను ప్రకటించింది.