Thursday, April 18, 2024

Karnataka: సిద్ధ‌రామ‌య్య‌పై ఫేస్ బుక్ లో కామెంట్.. ఉపాధ్యాయుడు స‌స్పెండ్

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌పై ఫేస్ బుక్ లో కామెంట్ పెట్ట‌డంతో ఆ ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు స‌స్పెండ్ అయ్యాడు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యారు. హొసదుర్గంలోని కానుబెన్నహళ్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తోన్న శాంతమూర్తి ఎంజీ అనే ఉపాధ్యాయుడు రాష్ట్ర ప్రభుత్వంపైనా, ఉచితాలపైనా విమర్శలు గుప్పించారు. ఫ్రీబీస్ ఇవ్వకుండా ఇంకేం చేయగలం అని శాంతమూర్తి ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. దాంతో పాటు వివిధ ముఖ్యమంత్రుల‌ హయాంలో చేసిన అప్పును ఆయన పేర్కొన్నాడు.

”మాజీ సీఎంల హయాంలో ఎస్‌ఎం కృష్ణ రూ.3,590 కోట్లు, ధరమ్‌సింగ్‌ రూ.15,635 కోట్లు, హెచ్‌డీ కుమారస్వామి రూ.3,545 కోట్లు, బీఎస్‌ యడ్యూరప్ప రూ.25,653 కోట్లు, డీవీ సదానందగౌడ రూ.9,464 కోట్లు, జగదీశ్‌ షెట్టర్‌ రూ.2 కోట్లు, సిద్ధరామయ్య రూ.41 కోట్లు.. 42,000 కోట్లు’ అప్పు చేశారని శాంతమూర్తి పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ మేరకు క్షేత్ర విద్యాశాఖాధికారి ఎల్‌.జయప్ప సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మే 20న కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో గత ప్రభుత్వాల హయాంలో చేసిన అప్పులను ప్రస్తావించి ఉపాధ్యాయుడు శాంతమూర్తి ప్రభుత్వ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement