Friday, April 26, 2024

చెల్లని రూపాయి!

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి టీఆర్ఎస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతకానివాడు, ఒక్క రూపాయి కూడా సహాయం చేయనివాడు చాలా మాట్లాడుతాడని.. చెల్లని రూపాయి అని అన్నారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని పదవులు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి… కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం ఓబులపూర్ గ్రామంలో కబడ్డీ క్రీడల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేతకానివారు, ఒక్క రూపాయి సహాయం చేయనివారు కూడా మాట్లాడుతున్నాడని… చెల్లని రూపాయి గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు. పనిచేసే వారిని నిరుత్సాహ పరుచడం కాదని, మగాడైతే ఆర్థిక సహాయం చేయాలన్నారని పేర్కొన్నారు.తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర ఛాయి తాగినా… పదవి ఇప్పిస్తాననో… పనులు ఇప్పిస్తాననో ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు. అలా తీసుకున్నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. పదవులు అమ్ముకుంటున్నారు, పనులు అమ్ముకుంటున్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో తాను చేసిన పనులు వారికి కనబడుతాలేవా అని ప్రశ్నించారు.కడియం వ్యాఖ్యలతో స్టేషన్ఘనపూర్ రాజకీయం వేడెక్కింది. కడియం, రాజయ్య ఇద్దరు కూడా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన విషయం తెలిసిందే. ఓవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించి టీఆర్ఎస్ అధిష్టానం మాంచి ఊపు మీదుంటే.. మరోవైపు ఉమ్మడి వరంగల్ టీఆర్ఎస్లో మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఏకంగా ఇద్దరు డిప్యూటీ సీఎంలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement