Thursday, April 18, 2024

సీబీఐ కోర్టులో కౌంట‌ర్ దాఖ‌లు చేసిన జ‌గ‌న్

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జ‌గన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణ‌ంరాజు వేసిన పిటిషన్‌పై నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిష‌న్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని జగన్‌తో పాటు సీబీఐని గతంలో కోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే.

ఇటీవ‌ల కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు గ‌డువు కోరిన‌ జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు ఈ రోజు కౌంటర్ దాఖలు చేసి త‌మ అభిప్రాయాలు తెలిపారు. తాను బెయిల్ ష‌ర‌తుల‌ను ఉల్లంఘించ‌లేద‌ని జ‌గ‌న్ చెప్పారు. ర‌ఘురామ పిటిష‌న్‌కు అర్హ‌త లేద‌ని కౌంట‌ర్‌లో ఆయ‌న పేర్కొన్నారు. వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం న్యాయ వ్య‌వ‌స్థ‌ను వాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ర‌ఘురామ దాఖలు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేయాల‌ని జగన్ కోరారు. అనంతరం ఈ కేసు విచారణను ఈనెల 14కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

మరోవైపు జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ కేసులో సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది. జగన్‌కు బెయిల్ రద్దుపై చట్ట ప్రకారం గౌరవ కోర్టు నిర్ణయం తీసుకోవాలని మెమో దాఖలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement