కరోనా పుణ్యమా అని వర్క్ ఫ్రమ్ హోం ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి ఈ వర్క్ ఫ్రమ్ హోం బాగా వర్క్ వుట్ అయింది. దాదాపు ఏడాదిన్నరపైగా ఇంటి వద్ద నుంచే వర్క్ చేస్తున్నారు ఉద్యోగులు. అయితే రీసెంట్ గా పలు కంపెనీలు ఆఫీసులకి వచ్చి పని చేయాలని పిలుపునిచ్చాయి. కాగా మరికొన్ని రోజుల్లో 2021ముగియనుంది. దాంతో ఈ ఏడాదిలో ఎందుకు.. ఎంచక్కా 2022 జనవరి మధ్య నుంచి కానీ ఫిబ్రవరి నుంచి కానీ పక్కాగా ఆఫీసులకు వచ్చి పని చేయాలని వివిధ కంపెనీలు గతంలో తమ ఉద్యోగులకు సూచనలు చేశాయి. కొన్ని కంపెనీలు మాత్రం.. 2022 మధ్య వరకు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి.
ఉద్యోగులు తమ ఆఫీసులకు వెళ్లే టైం దగ్గరకు వస్తున్న వేళ.. ఒమిక్రాన్ రూపంలో కొత్త బెడద మొదలైంది. దీంతో.. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు తీసుకొచ్చే విషయంపై పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే టీసీఎస్ అధికారికంగా వచ్చే ఏడాది మధ్య వరకు తమ ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయిస్తామని చెప్పింది. ఐటీ ఉద్యోగుల్లో దాదాపు 90 శాతం రెండు వ్యాక్సినేషన్ల డోసులు పూర్తి చేసుకున్నారు. అయితే.. కొత్త వేరియంట్ వ్యాక్సిన్లు వేసుకున్న వారిని సైతం వదలకపోవటం.. మిగిలిన వేరియంట్లతో పోలిస్తే.. వేగంగా విస్తరించటంతో తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు వచ్చి పని చేసే కన్నా.. ఇంటికే పరిమితం కావటం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వచ్చే ఏడాది మొదట్లోనే ఆఫీసులకు రావాలని ఇప్పటికే సమాచారం ఇచ్చిన కంపెనీలు.. మరో వారం వ్యవధిలో కొత్త సందేశాన్ని కమ్యునకేట్ చేయనున్నారట. ఒమిక్రాన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి.. మార్చిలో భారత్ లో పెద్ద ఎత్తున వ్యాపిస్తుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో.. ఈ వేరియంట్ ప్రభావం ఏమేరకు ఉంటుందన్న విషయంపై స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే.. తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు పిలవనున్నారట. ఒకవేళ ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువ ఉంటే.. వచ్చే ఏడాది మొత్తం ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉంటే 2022 మధ్య భాగం నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రమ్మని చెప్పొచ్చన్న మాట వినిపిస్తోంది. ఇది వర్క్ ఫ్రంహోం చేసేవారికి శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అడుగు బయట పెట్టకపోవడమే మంచిదనే మాటలు వినిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..