Wednesday, March 27, 2024

ISRO | మరో ప్రయోగానికి ఇస్రో రెడీ.. రేపు నింగిలోకి ఎన్‌వీఎస్‌-1 శాటిలైట్‌

భారత అంతరక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ప్రయోగానికి రెడీ అయ్యింది. నావిగేషన్‌ శాటిలైట్‌ ఎన్‌వీఎస్‌-1ను రేపు (సోమవారం) నింగిలోకి పంపనుంది. గతంలో నావిగేషన్‌ సర్వీసెస్‌ కోసం పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాల్లో నాలుగింటి జీవిత కాలం ముగిసింది. ఆ సిరీస్‌లో భాగంగానే ఈ ఎన్‌వీఎస్‌ ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ (NavIC) పేరుతో ఇస్రో అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇది. కక్ష్యలో ఉన్న ఏడు ఉపగ్రహాల సమూహం కాగా.. ఇది గ్రౌండ్ స్టేషన్‌లతో కలిసి పని చేయనుంది.

ఇక.. నెట్‌వర్క్ సాధారణ వినియోగదారులు, వ్యూహాత్మక వినియోగదారులకు నావిగేషనల్ సేవలను కూడా ఈ శాటిలైట్​ అందిస్తుంది. సాయుధ దళాలు, మెరుగైన పొజిషనింగ్, నావిగేషన్ అండ్‌ టైమింగ్ కోసం దేశంలో పౌర విమానయాన రంగానికి పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేసింది. రెండో తరం నావిగేషన్ శాటిలైట్ సిరీస్‌లో NVS-1 ఇది మొదటిదని ఇస్రో తెలిపింది. ఇది లెగసీ NavIC సేవల కొనసాగింపును నిర్ధారిస్తుందని, Li బ్యాండ్‌లో కొత్త సేవలను అందించనున్నట్టు ఇస్రో అధికారులు వెల్లడించారు.

ఈ శాటిలైట్‌ను సోమవారం శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని రెండో ప్యాడ్‌ నుంచి నింగిలోకి పంపనుండగా.. దీన్ని జీఎస్‌ఎల్‌వీ మోసుకెళ్లనున్నది. సోమవారం ఉదయం 10.42 గంటలకు ప్రయోగం చేపట్టనుండగా.. ఆదివారం ఉదయం 7గంటల 12నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. 27గంటల 30 నిమిషాల పాటు నిరంతరాయంగా కౌంట్‌డౌన్ కొనసాగనుంది. 2,232 కిలోల ఎన్‌వీఎస్‌–01 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం సందర్భంగా ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో పూజలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement