Wednesday, April 17, 2024

దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. కేటీఆర్‌తో భేటీ తర్వాత ప్రకటించిన కంపెనీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం-2022 వార్షిక సమావేశాల్లో తొలిరోజే తెలంగాణకు భారీ పెట్టుబడులు దక్కాయి. ఫస్ట్‌ స్టాప్‌ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఒక ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఈ సదస్సు కోసం దావోస్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశాల అనంతరం పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. రాష్ట్రంలో రూ.500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు లూలూ గ్రూపు ముందుకు వచ్చింది. ఈ మేరకు దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సంస్థ అధిపతి యూసుఫ్‌ అలీతో జరిగిన సమావేశంలో ఈ పెట్టుబడిని ప్రకటించింది. రూ.500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు సంబంధించిన అనుమతి పత్రాలను ఈ సందర్భంగా యూసుఫ్‌ అలీకి కేటీఆర్‌ అందించారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి సంబంధించి తెలంగాణలో మరో ప్రాంతంలోనూ తమ యూనిట్‌ ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు యూసుఫ్‌ అలీ తెలిపారు. తమ ఫుడ్‌ స్రెసెింగ్‌ యూనిట్‌లకు సంబంధించి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రాంతం నుంచి యూరప్‌ వంటి విదేశాలకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో తమ యూనిట్‌ ఉండబోతున్నట్లు యూసుఫ్‌ అలీ తెలిపారు. తెలంగాణలో తమ గ్రూప్‌ తరపున మరిన్ని పెట్టుబడులను భారీ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాల కోసం పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాలను ఎంచుకున్నామని ఆయా ప్రాపర్టీల యజమానులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్భుతమైన షాపింగ్‌ మాల్‌ నిర్మించాలన్నది తమ లక్ష్యమని కేటీఆర్‌ తెలిపారు.

హైదరాబాద్‌ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి అని, ఇక్కడ లూలూ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ల ద్వారా వ్యవసాయోత్పత్తులకు, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులకు డిమాండ్‌ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని ఈ దిశగా లూలూ గ్రూప్‌ అంతర్జాతీయ స్థాయి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు దోహదపడుతుందని కేటీఆర్‌ అన్నారు.

స్విస్‌ రే బీమా కంపెనీ పెట్టుబడులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మరో అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. స్విట్జర్లాండ్‌కు చెందవిన ప్రఖ్యాత బీమా సేవల సంస్థ స్విస్‌ రే హైదరాబాద్‌లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటనలో భాగంగా కంపెనీ ఈ మేరకు ప్రకటన చేసింది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో స్విస్‌ రే కంపెనీ ఎండీ వెరోనికా, ఇతర ప్రతినిధులు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బీమా రంగంలోకి స్విస్‌ రేకు స్వాగతమని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. స్విస్‌ రే కంపెనీ ఆగస్టు నెలలో హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందని కేటీఆర్‌ చెప్పారు. 250 మంది ఉద్యోగులతో ప్రారంభమయ్యే హైదరాబాద్‌ యూనిట్‌లో డేటా, డిజిటల్‌ కేపబిలిటీస్‌, ప్రోడక్ట్‌ మోడలింగ్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు స్విస్‌ రే కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. 160 సంవత్సరాల స్విట్జర్లాండ్‌ బీమా దిగ్గజం హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టీ హబ్‌తో కలిసి పనిచేయనున్నట్లు స్విస్‌ రే తెలిపడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు.

- Advertisement -

హైదరాబాద్‌లో రెండు ఫార్మా యూనిట్లు ఏర్పాటు చేయనున్న కీమో ఫార్మా

స్పానిష్‌ మల్టిd నేషనల్‌ కంపెనీ హైదరాబాద్‌ నగరంలో 100 కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. స్పెయిన్‌ దేశానికి చెందిన కీమో ఫార్మా ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో తన కార్యకలాపాలను కొనసాగిస్తుండగా దీనికి అదనంగా తన రెండో ఉత్పత్తి యూనిట్‌ను 100 కోట్ల రూపాయలతో ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 2018 సంవత్సరంలో కంపెనీ క్వాలిటీ కంట్రోల్‌ స్టెబిలిటీ ల్యాబ్స్‌ వంటి విభాగాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించిందని, ప్రస్తుతం స్థాపించనున్న రెండవ యూనిట్‌ ద్వారా తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ పెట్టుబడితో పాటు సమీప భవిష్యత్తులో ఆక్టివ్‌ ఫార్మాసుటికల్‌ ఇంగ్రిడియెంట్‌(ఏపీఐ) , పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. సోమవారం మంత్రి కేటీఆర్‌తో దావోస్‌ డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాల్లో భాగంగా భేటీ అయిన కీమో గ్రూప్‌ పరిశోధన అభివృద్ధి డైరెక్టర్‌ జీన్‌ డానియల్‌ బోనీ ఈ మేరకు తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే తాము సుమారు 170 కోట్ల పెట్టుబడులు పెట్టామని, 270 మంది ఉద్యోగులున్నారని త్వరలో అదనపుప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడిపెట్టేందుకు ముందుకు వచ్చిన కీమో గ్రూప్‌కు మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కంపెనీలతో భేటీల్లో మంత్రి వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, లైఫ్‌సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తినాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement