Thursday, April 25, 2024

Tokyo Olympics: రెజ్లింగ్ ఫైనల్‌లో ఓడిపోయిన రవికుమార్

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో బంగారు పతకం చేజారింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఫైనల్లో భారత యోధుడు రవికుమార్ దహియాకు రజతం లభించింది. స్వర్ణం కోసం జరిగిన పోరులో రవికుమార్ రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) జట్టుకు చెందిన జవూర్ ఉగుయేవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ ఫైనల్ పోరులో ఉగుయేవ్‌కు 7 పాయింట్లు దక్కగా, రవికుమార్ 4 పాయింట్లు మాత్రమే సాధించి రజతంతో సరిపెట్టుకున్నాడు. దీంతో భారత ఒలింపిక్ చరిత్రలోనే సిల్వర్ గెలిచిన రెండో రెజ్లర్‌గా రవికుమార్ చరిత్రకెక్కాడు.

కాగా భారత్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో ఇది రెండో రజతం. వారం కిందట మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌లో దేశానికి తొలి రజతం అందించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు రెండు రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం 5 పతకాలు సాధించి, ఓవరాల్ పతకాల పట్టికలో 62వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చైనా 33 స్వర్ణాలతో అగ్రస్థానంలో ఉండగా, 27 బంగారు పతకాలతో అమెరికా రెండో స్థానంలో ఉంది.

ఈ వార్త కూడా చదవండి: టోక్యో ఒలింపిక్స్‌లో బాహుబలి బంగారం సాధించాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement