Friday, April 19, 2024

ఇవ్వాల 1.30కు మూడో వన్డే.. క్లీన్​ స్వీపే టార్గెట్​గా బరిలోకి ఇండియా

విండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డేసిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలుచుకున్న భారతజట్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. వన్డే సిరీస్‌లోని చివరివన్డే నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1.30కు ప్రారంభంకానుంది. ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా మూడో వన్డేలోనూ గెలిచి విండీస్‌ను వైట్‌వాష్‌ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో చివరి వన్డేలో పలువురి ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని భావిస్తోంది. దీంతో శిఖర్‌ ధావన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సైనీ, కుల్దిప్‌ యాదవ్‌ తదితరులకు అవకాశం ఇవ్వాలని టీమిండియా యాజమాన్యం నిర్ణయించిందని సమాచారం.

వన్డే సిరీస్‌కు ముందు కరోనా బారినపడిన సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కోలుకోవడంతో నేటి మ్యాచ్‌లో ఆడనున్నాడు. రెండో వన్డేకు ముందే ధావన్‌ కోలుకుని ప్రాక్టీస్‌ ప్రారంభించినా ఆడే అవకాశం రాలేదు. దీంతో నేడు కొత్త మొహాలతోనే టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. టీ20 సిరీస్‌ తరలో మొదలవనున్న నేపథ్యంలో యుజ్వేంద్ర చాహల్‌కు విశ్రాంతినిచ్చి కుల్దిdప్‌ యాదవ్‌కు అవకాశం ఇవనున్నారు. అదేవిధంగా పేసర్లు సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌లో ఒకరికి విశ్రాంతినిచ్చి దీపక్‌ చాహర్‌కు మూడో వన్డేలో అవకాశం కల్పించనున్నారు. దీపక్‌హుడా స్థానంలో రవిబిష్ణోయ్‌ బరిలోకి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. కాగా శుక్రవారం జరిగే మూడో వన్డేలో శిఖర్‌ ధావన్‌తో కలిసి రోహిత్‌శర్మ భారత్‌ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. తొలి వన్డేలో ఇషాన్‌కిషన్‌, రెండో వన్డేలో పంత్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగితే మూడో వన్డేలో ధావన్‌ ఓపెనర్‌గా రానున్నాడు. దీంతో మూడువన్డేల్లో వేరేరు భాగసాములతో హిట్‌మ్యాన్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించి సిరీస్‌ను సొంతం చేసుకున్న ఘనతను అందుకోనున్నాడు. విరాట్‌కోహ్లీ, రిషభ్‌పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌తో కూడిన టీమిండియా మిడిలార్డర్‌ బలంగా కనిపిస్తోంది. శ్రేయస్‌ అయ్యర్‌ తుదిజట్టులోకి తీసుకునే విషయంలో స్పష్టత లేదు. వన్డే సిరీస్‌ అనంతరం విండీస్‌తో పొట్టిసిరీస్‌ ప్రారంభం కానుంది.

ఈనేపథ్యంలో వైట్‌బాల్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ ప్రయోగాలకు తెరలేపనున్నాడు. విండీస్‌ను కట్టడి చేయడంలో ప్రధానంగా భారత బౌలర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. వన్డే సిరీస్‌ ఇప్పటికే చేజారిపోయినా విండీస్‌ జట్టు నామమాత్రపు చివరి మ్యాచ్‌లోనైనా గెలుచుకుని భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయకుండా అడ్డుకోవాలని ఆశిస్తోంది. మూడో వన్డేలో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో టీ20 సిరీస్‌కు సన్నద్ధం కావాలని కరీబియన్లు భావిస్తున్నారు. కాగా గాయంతో రెండో వన్డేకు దూరమైన విండీస్‌ కెప్టెన్‌ పొలార్డ్‌ మూడో మ్యాచ్‌కు అందుబాటులో రాకపోతే నికోలస్‌ పూరన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విండీస్‌ పేసర్లు కీమర్‌ రోచ్‌, అల్జారీ జోసెఫ్‌, ఓడిన్‌స్మిత్‌ టీమిండియాను స్వల్పస్కోరుకే కట్టడిచేయడంలో సఫలం అవతున్నా..బ్యాటర్లు మాత్రం తేలిపోవడం ఆ జట్టును కలవరపరుస్తోంది.

భారత్‌ అంచనా జట్టు: రోహిత్‌శర్మ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, విరాట్‌కోహ్లీ, రిషభ్‌పంత్‌ (వికెట్‌కీపర్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌/దీపక్‌ చాహర్‌, సిరాజ్‌, చాహల్‌/కుల్దిdప్‌యాదవ్‌, ప్రసిధ్‌కృష్ణ.

వెస్టిండీస్‌ అంచనా జట్టు: బ్రాండన్‌ కింగ్‌, షాయ్‌హోప్‌ (వికెట్‌కీపర్‌), బ్రావో, బ్రూక్స్‌, నికోలస్‌ పూరన్‌ (కెప్టెన్‌), జాసన్‌ హోల్డర్‌, అకీల్‌, ఫాబియన్‌ అలెన్‌, స్మిత్‌, అల్జారీ జోసెఫ్‌, కీమర్‌ రోచ్‌.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement