Friday, March 29, 2024

Telangana: ఎన్నికల సింబల్స్​లో ఆ 8 గుర్తులు తొలిగించాలే.. హైకోర్టుకు వెళ్లనున్న టీఆర్​ఎస్​

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్​ఎస్​ పార్టీ సింబల్​ని పోలిన కారు గుర్తును పోలిన మరో 8 సింబల్స్​ని తొలగించాలని టీఆర్​ఎస్​ ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేసింది. అయినా ఈసీ పట్టించుకోకపోవడంతో న్యాయ పోరాటానికి రెడీ అయ్యింది. దీనిపై హౌజ్ మోషన్ విచారణ చేపట్టాలని నిన్న కోరగా.. న్యాయమూర్తి ఇంట్లో అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో రేపు లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని టీఆర్​ఎస్​ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఎన్నికల గుర్తుల జాబితా నుంచి కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ వంటి గుర్తులను తొలగించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన ఎన్నికల కమిషన్‌ను టీఆర్​ఎస్​ కోరింది. అయితే ఈసీ నుంచి సరైన రెస్పాన్స్​ రాకపోవడంతో పార్టీ పెద్దలు హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేశారు.

2018 ఎన్నికల్లో కూడా కారును పోలిన సింబల్స్​ వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్​ఎస్​ నేతలు చెబుతున్నారు. దీంతో పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా.. ఈ గుర్తులతో బరిలో ఉన్న ఇండిపెండెంట్​ అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆధారాలు చూపుతున్నారు. టీఆర్​ఎస్​ సింబల్​కు తగ్గట్టే కారును పోలి ఉన్నందునే వారికి ఓట్లు పడ్డట్లు స్పష్టమవుతోందని ఈసీకి టీఆర్​ఎస్​ నేతలు వివరించారు.

అంతేకాకుండా మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్‌లో 2018లో జరిగిన ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్‌లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. దీంతో కారు గుర్తును పోలి ఉన్న 8 గుర్తులను తొలగించాలని కోరారు. దీనిపై సోమవారం లంచ్ మోషన్‌కు అనుమతి కోరి పిటిషన్ వేసేందుకు టీఆర్​ఎస్​ నేతలు రెడీ అయినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement