Thursday, April 25, 2024

శరవేగంగా హైదరాబాద్‌ మౌలిక వసతుల అభివృద్ధి.. మూసీని 100 శాతం సుందరీకరిస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశంలో ఎక్కడా లేనంత వేగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. నగర రవాణా మెరుగు పర్చేందుకు బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. 5వేల 555కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్‌ 1, 3వేల 115కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్‌2 పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ”హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడానికి కావాల్సిన అన్ని హంగులను ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో ఏ నగరంలో జరగనంత వేగంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్‌లు, అండర్‌ పాస్‌లు, స్కై వంతెనలతో నగర ప్రజలకు రవాణా సులభతరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సార్డీపీ కారణంగా హైదరాబాద్‌లో ప్రస్తుతం రోడ్ల మీద వాహనాల వేగం సగటున గంటలకు 40 కిలోమీటర్లుగాఉందని, ఇది దేశంలోని అన్ని మెట్రోనగరాల్లో కంటే చాలా ఎక్కువన్నారు. కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తోందని తెగ ఊదరకొడుతున్నారు. కానీ, తీసుకువచ్చిన అప్పులకు డబుల్‌ ఆదాయం వచ్చేలా పనులు చేపడుతున్నామన్నారు.

ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా భాగ్యనగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. మూసీ నది సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్‌ను 100 శాతం మురుగుజలాలను శుద్ధి చేసే నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా 36 ప్రాంతాల్లో 3వేల 866 కోట్లతో ఎస్టీపీ (సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌)లు నెలకొల్పుతున్నామని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. మూసీపై చెక్‌డ్యామ్‌లు, 14 వంతెనలు నిర్మించబోతున్నామని పేర్కొన్నారు. ఈ 14 వంతెనలు వైవిద్యంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అద్భుతంగా డిజైన్‌ చేస్తున్నామని చెప్పారు. దానికోసమే పురపాలక అధికారులు, ప్రజాప్రతినిధులను ఇతర దేశాలకు వెళ్లి అక్కడి వంతెనల నిర్మాణాలపై అధ్యయనం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దేశమే ఆశ్చర్యపోయేలా మూసీ సుందరీకరణ చేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement