Friday, March 29, 2024

Huzurabad Bypoll: అభ్య‌ర్థుల‌కు పండ‌గే.. అద‌నంగా రెండు గంట‌ల సమయం

తెలంగాణ ప్ర‌జ‌లంతా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌పై దృష్టి సారించారు. ఈ ఎన్నిక‌ల్లో పోటా పోటీగా టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ లు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాయి. అధికార పార్టీతో పాటు ప్ర‌త్య‌ర్థి అభ్య‌ర్థుల మ‌ధ్య నువ్వా ? నేనా? అనే పోటీ న‌డుస్తోంది. జ‌యాప‌జ‌యాల సంగ‌తి ప‌క్క‌న పెడితే..హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. గతంతో పోలిస్తే పోలింగ్ సమయాన్ని రెండు గంటలు అదనంగా పెంచారు. దీంతో ఈ దఫా భారీగా ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈటెల  రాజీనామాతో ఈ నెల 30న హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 305 పోలింగ్ స్టేషన్లున్నాయి. ఈ పోలింగ్ స్టేషన్లలో  ఓటర్లకు అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వచ్చే వికలాంగులకు  ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో క‌రోనా నిబంధనల మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి జరుగుతోంది. ఇక ఓట‌ర్స్ భౌతికదూరం, మాస్క్, శానిటైజర్ల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఈసారి పోలింగ్‌ సమయాన్ని రెండు గంటలు అదనంగా కేటాయించారు. సాయంత్రం ఏడు గంటల లోపుగా ఓటరు పోలింగ్ కేంద్రానికి చేరితే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. రెండు గంటలు అదనంగా సమయం కేటాయించడంతో ఇతరరాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కూడ రప్పించి ఓటు హక్కును వినియోగించుకొనేలా  పార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2.36 లక్షల మంది ఓటర్లున్నారు. ఓటర్లందరికీ అధికారులు ఓటింగ్ స్లిప్‌లు పంపిణీ చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఏ ఒక్క ఓట‌ర్ ని వ‌దిలిపెట్ట‌కుండా ఓట్లు న‌మోద‌య్యేలా ప‌లు పార్టీల నేత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 30న ఉపఎన్నిక జరగనుంది.

ఇది కూడా చదవండి: స్ఫూర్తిని రగిలించే కథలు.. ఐఐటీ ర్యాంకర్లకు సీఎం అభినందనలు

Advertisement

తాజా వార్తలు

Advertisement