Wednesday, April 24, 2024

అక్కడోమాట.. ఇక్కడో మాట.. తెలంగాణ బీజేపీ ఎంపీలది ద్వంద్వ వైఖరి.. టీఆర్​ఎస్​ ఎంపీల ఫైర్‌..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ధాన్యం సేకరణకు సంబంధించి తెలంగాణాలో కల్లోలం సృష్టిస్తూ… అదే అంశంపై పార్లమెంట్‌లో మాత్రం పెదవి విప్పరా అని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నాగేశ్వరరావు మండిపడ్డారు. రైతులకు ప్రయోజనాలను చేకూర్చే విషయంలో రాజకీయాలొద్దని హెచ్చరించారు. రైతాంగం సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి రాష్ట్ర బీజేపీ నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. గురువారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో టీఆర్‌ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ రైతులు పండిస్తున్న పంటపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్ర రైతాంగ ఇబ్బందులు, పంట కొనుగోలుకు సంబంధించిన ప్రధాన సమస్యను ఈనెల 28న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ముందస్తుగానే అఖిల పక్షం సమావేశంలో చెప్పామని నామా తెలిపారు.

కనీసం తమ సమస్యకు పరిష్కారం చూపిస్తారని భావిస్తే, కేంద్రం దానిపై కూడా దృష్టి సారించడం లేదన్నారు. ప్రతిరోజూ కూడా అటు లోక్ సభలో, ఇటు రాజ్యసభలో అందరూ ఎంపీలం ఆందోళన చేస్తున్నామని చేశారు. లోక్‌సభలో కానీ రాజ్యసభలో కానీ ఏదో ఒక్క సభలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అయితే తమ డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. పండించిన ధాన్యం కొనక, రాబోయే కాలంలో ఏ పంట వేయాలో తెలియక తెలంగాణ రైతాంగం అయోమయంలో ఉన్నారన్నారు. పంట కొనుగోలుపై ఒక్కో బీజేపీ నేత ఒక్కో విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు గురువారం నాడు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి రైతు సమస్యలను వివరిస్తున్న క్రమంలో మైక్ కట్ చేశారని వాపోయారు. మైక్ కట్ చేసినంత మాత్రాన తమ గొంతు నొక్కలేరని తేల్చి చెప్పారు. సభలో తాను తెలంగాణ రైతుల డిమాండ్ను లేవనెత్తే క్రమంలో టీ బీజేపీ నేతలు అనరాని మాటలు పార్లమెంట్ సాక్షిగా తమను అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రైతుల కోసం వాటన్నింటిని భరించామన్నారు. ఈ క్రమంలోనే లోక్ సభలో, రాజ్యసభలో వాకౌట్ చేసి పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేసినట్లు నామా నాగేశ్వరరావు తెలిపారు. కనీస బాధ్యతగా తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని సమావేశం పెడితే అందులో పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లేదంటే కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పార్లమెంట్‌లో సంబంధిత మంత్రి ద్వారా ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ఆహార భద్రత, ఎఫ్‌సీఐ సేకరణ, రైల్వేకు సంబంధించిన అంశాలన్నీ కేంద్రం పరిధిలోనే ఉంటాయనే విషయాన్ని రైతులు గమనించాలన్నారు. పండించిన పంటను కొనకపోవడం, కావాల్సినన్ని రైల్వే ర్యాక్‌లను ఏర్పాటు చేయకపోవడం, మానవ వనరులను అందించడంలోనూ ఎఫ్‌సీఐ వివక్ష చూపిస్తోందని నామా ఆరోపించారు రైతులకు న్యాయం జరిగే విషయంలో ప్రతి ఒక్కరూ తమతో కలిసి వచ్చి పోరాటానికి మద్దతు తెలపాలన్నారు. వారికి న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement