Friday, March 29, 2024

జాబ్ ఇప్పిస్తానని లొంగదీసుకున్నడు.. 50 మందిని మోసం చేసిన కీచ‌కుడు అరెస్టు..

యువతులు, మహిళల అవసరాలను ఆసరాగా చేసుకున్న ఓ వ్యక్తి దురాగతం బయటపడింది. జాబ్ పేరిట చాలామంది నుంచి డబ్బులు దండుకోవడమే కాకుండా వారిని లొంగదీసుకున్నాడు. చాలా మందిని తన సెక్స్ కోరికలు తీర్చుకునేందుకు వాడుకున్నాడు. అలాంటి వ్యక్తిని పోలీసులు పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు.

ఉత్తరాఖండ్ నైనితాల్​ జిల్లా హల్ద్వానీలో 50 మందికి పైగా మహిళలను మోసం చేసిన ఓ కీచకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని వారి నుంచి రూ.లక్షలు దండుకోవడమే గాక, లైంగికంగా వేధించాడని, బలవంతంగా శృంగార వాంఛ తీర్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు. బఘేశ్వర్​కు చెందిన ఈ నిందితుడి పేరు చారు చంద్ర జోషి. ప్రస్తుతం హల్ద్వానీ దొన్హారియా ఫ్రెండ్స్ కాలనీలో నివాసముంటున్నాడు. చంబల్​ వంతెన సమీపంలోని ఓ పార్కు వద్ద పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..

చారు చంద్ర జోషి సోషల్ మీడియా, ఫేస్​బుక్​ ద్వారా మహిళలను పరిచయం చేసుకుంటాడు. నర్సింగ్​ కోర్సు (జీఎన్​ఎం) చేసే మహిళలను టార్గెట్ చేసుకుని వాళ్లకు మాయమాటలు చెబుతాడు. తాను జిల్లా మెడికల్​ ఆఫీసర్​నని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబుచ్చుతాడు. అందుకు డబ్బులు కావాలని చెప్పి రూ.లక్షలు గుంజుతాడు. ఒక్కోసారి బలవంతం చేసి లైంగిక వాంఛ కూడా తీర్చుకుంటాడు. ఇట్లా మొత్తం 50 మందికిపైగా మహిళలను ఇతను మోసం చేశాడని క్రైం బ్రాంచ్ ఎస్పీ జగదీశ్ చంద్ర తెలిపారు.

ఉద్యోగం ఇప్పిస్తానని హల్ద్వానీ ప్రాంతంలో ఓ మహిళ నుంచి రూ.5లక్షలు తీసుకున్నాడని పోలీసు అధికారి చెప్పారు. విచారణలో ఇంకా చాలా నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అన్ని నేరాలను నిందితుడు అంగీకరించాడని,  అయితే చారు చంద్రపై ఇప్పటివరకు రెండు కేసులు మాత్రమే నమోదయినట్టు తెలిపారు. సమాజంలో పరువు, ప్రతిష్ఠల గురించి ఆలోచించి మిగతా మహిళలు పోలీసు కేసు పెట్టలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం దర్యాప్తు చేపడతామన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement